శ్రీరంగం: దేవాలయం వెబ్ సైట్ హ్యాక్
తిరుచ్చి: ప్రసిద్ది చెందిన తిరుచ్చిలోని శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. దేవాలయానికి చెందిన అధికారిక వెబ్ సైట్ ను శనివారం వేకువ జామున రెండున్న గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు.
తరువాత కాశ్మీర్ కైవసం తమ లక్షం అంటూ పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. విషయం గుర్తించిన దేవాలయం అధికారులు తిరుచ్చి నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
వైష్ణవ క్షేత్రాల్లో శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయం ఒకటి. శ్రీరంగనాథ స్వామి ఆలయం అతి పెద్దప్రాకారంతో దేదీప్యమానంగా కనిపిస్తుంటుంది. ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు, 50 సన్నిధులు ఆలయంలో ఉన్నాయి.
గత నెలలో జీర్ణోద్ధరణ పనులు ముగించి రంగరంగ వైభవంగా కుంభాభిషేక వేడుకలు నిర్వహించారు. ఇదే నెలలో జరగనున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ సందర్బంలో దేవాలయం అధికారిక వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు.
పోలీసులు ఆలయ పరిసరప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే తిరుచ్చి కలెక్టర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. వైకుంఠ ఏకాదశి సందర్బంగా మధురై నుంచి అదనపు బలగాలను తిరుచ్చికి తరలిస్తున్నారు.