దళితులంటే ఎవరు? ముస్లింలు ఎలావుంటారు?: వివాదం రేపిన సీబీఎస్ఈ పరీక్షప్రశ్నలు
చెన్నై: సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం ఇప్పుడు ఓ భారీ వివాదానికి తెరలేపింది. ఇందుకు ఆరో తరగతి ప్రశ్నాపత్రంలో దళితులు, ముస్లింలకు సంబంధించిన ప్రశ్నలు వివాదాస్పదంగా ఉండటమే కారణం. దీంతో రాజకీయ పక్షాలు ఇలాంటి ప్రశ్నలు వేస్తారా? అంటూ మండిపడుతున్నాయి.
కాగా, ఈ ప్రశ్నాపత్రానికి సంబంధించిన ఓ ఫొటోను డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా బోధించే కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షలో ఇలాంటి ప్రశ్నలు వేస్తారా? అని నిలదీశారు.
ఇక వివాదాస్పదమైన ప్రశ్నలను ఒక్కసారి గమనించినట్లయితే.. దళితులంటే ఎవరు? అని అడిగారు. దానికి సమాధానంగా.. ఎ) విదేశీయులు, బి) అంటరానివారు సి) మధ్యతరగతివారు డీ) ఎగువ తరగతులవారు అనే ఆప్షన్లుగా ఇచ్చారు. ఇక మరో ప్రశ్నను గమనిస్తే.. ముస్లిలకు సంబంధించిన ఈ క్రింది సాధారణ అంశమేది? అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు జవాబులుగా.. ఎ) ముస్లింలు బాలికలను పాఠశాలలకు పంపరు బి) వారు శుద్ధ శాఖాహారులు సీ) వారు రోజా సమయంలో నిద్రపోరు, డీ) పైవన్నీ.. అనే ఆప్షన్లను ఇచ్చారు.
Shocked and appalled to see that a Class 6 Kendriya Vidyalaya exam contains questions that propagate caste discrimination and communal division.
— M.K.Stalin (@mkstalin) September 7, 2019
Those who are responsible for drafting this Question Paper must be prosecuted under appropriate provisions of law.@HRDMinistry pic.twitter.com/kddu8jdbN7
పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల్లోనే ఇలా కులం, మతం పేరిట విషాన్ని నింపుతారా? అని రాజకీయ పక్షాలతోపాటు విద్యావేత్తలు కూడా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత ముదురుతోంది. ఈ ప్రశ్నలను నిర్లక్ష్యంగా ముద్రించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నాయి.