కర్ణాటక ఎత్తులకు తమిళనాడు పై ఎత్తులు: అన్నాడీఎంకే, డీఎంకే దోస్తీ, మోడీకి చెక్!
చెన్నై: కర్ణాటక వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వెయ్యడానికి తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీ చేతులు కలుపుతున్నాయి. తమిళనాడు రైతులు, ప్రజలకు మేలు చెయ్యడానికి రాజకీయంగా భద్దశత్రువులు అయిన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఒక్కటి కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాని మోడీకి సోమవారం వరకూ డెడ్ లైన్ పెట్టారు.
కర్ణాటక ఎత్తులు
కావేరీ నీటి పంపిణి విషయంలో సుధీర్ఘంగా తమిళనాడుతో న్యాయపోరాటం చేసిన కర్ణాటక ప్రభుత్వం చివరికి విజయం సాధించింది. కావేరీ నీటి పంపిణి నిర్వహణ బోర్డు ఇచ్చిన ఆదేశాలకంటే తక్కువ టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేసే విషయంలో కర్ణాటక పంతం నెగ్గించుకుంది.
సుప్రీం కోర్టు క్లారిటీ
కావేరీ నీటి పంపిణి విషయంలో సంచల తీర్పు ప్రకటించిన సుప్రీం కోర్టు కావేరీ నీటి పంపిణి నిర్వహణ బోర్డు ఏర్పాటు చెయ్యడం, చెయ్యకపోవడం అనే విషయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ విషయంలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దెబ్బ
కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కావేరీ నీటి పంపిణి నిర్వహణ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. కావేరీ నీటి పంపిణి నిర్వహణ బోర్డు ఏర్పాటు చేస్తే కర్ణాటకలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ పడుతుందని ప్రధాని మోడీ, అమిత్ షా ఆలోచిస్తున్నారు.
సీఎం, స్టాలిన్ భేటీ
శనివారం చెన్నైలోని సచివాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ భేటీ అయ్యి కావేరీ నీటి పంపిణి నిర్వహణ బోర్డు ఏర్పాటు చేయించే విషయంలో సుదీర్ఘంగా చర్చించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.
ప్రధాని మోడీకి డెడ్ లైన్
చర్చల తరువాత సీఎం పళనిస్వామి, ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ కావేరీ నీటి పంపిణి నిర్వహణ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో సోమవారం వరకు వేచి చూస్తామని, ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూసి తరువాత శాసన సభ సమావేశం ఏర్పాటు చేసి చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.