భారత విద్యార్థుల ఘనత: ప్రపంచ అత్యంత చిన్న ఉపగ్రహాన్ని రూ.15వేలకే రూపొందించారు!
చెన్నై: తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రపంచంలోనే అత్యంత చిన్న ఉపగ్రహాన్ని తయారు చేసి చరిత్ర సృష్టించారు. అరచేతిలో పట్టేంత చిన్న శాటిలైట్ను వీరు రూపొందించారు. దీంతో ప్రపంచంలోనే అతి చిన్న ఉపగహ్రంగా ఇది సరికొత్త రికార్డును సృష్టించనుంది.
అంతేగాక, సాధారణ సైజు గుడ్డు కంటే కూడా తక్కువ బరువుండే ఈ శాటిలైట్ను తయారుచేయడానికి అయిన ఖర్చు కూడా కేవలం రూ. 15,000 మాత్రమే కావడం గమనార్హం. అందుకే ప్రపంచంలోనే చౌకైన ఉపగ్రహంగా కూడా మరో రికార్డు సాధించనుంది.
చెన్నై సమీపంలోని కెలంబక్కమ్లో గల హిందుస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న హరికృష్ణన్, అమరనాథ్, సుధి, గిరి ప్రసాద్ ఈ శాటిలైట్ను తయారుచేశారు. దీని పేరు 'జైహింద్-1ఎస్'. బరువు 33.39 గ్రాములు. వాతావరణ సమాచారం సేకరించేందుకు ఈ ఉపగ్రహాన్ని తయారుచేశారు.
కాగా, 20 విభిన్న వాతావరణ పారామీటర్స్ను గుర్తించే సామర్థ్యం ఈ ఉపగ్రహానికి ఉంది. దీంతోపాటు సెకనుకు నాలుగు విభిన్న పారామీటర్స్ను రికార్డ్ చేసి మెమొరీ కార్డులో భద్రపరుస్తుందని ఆ విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవలే దీనికి పరీక్షలు నిర్వహించి నాసాకు పంపించారు. ఆగస్టులో దీన్ని కక్ష్యలోకి ప్రయోగించే అవకాశం ఉంది.