నేరుగా ఇంటికే ఈసీ, పాల ప్యాకెట్లపై ఎన్నికల ప్రచారం
చెన్నై: తమిళనాడులో ప్రజలలో ఓటింగ్ విషయంలో చైతన్యం తెచ్చేందుకు తమిళనాడులో ఎన్నికల సంఘం నేరుగా ఉదయం పూట కూడా ఇంటికి సందేశాన్ని పంపిస్తోంది. తమిళనాడులో మే 16వ తేదిన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రజల్లో ఓటింగు విషయమై చైతన్యం కలిగించేందుకు ఈసీ ఎన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వేకువజామునే ఇంటి వద్దకు వచ్చే పాల ప్యాకెట్ల కూడా ఓటింగ్ విషయంలో అవగాహన కల్పించేందుకు ఉపయోగించుకుంటోంది.
ఇటీవల దుకాణాల క్యారీ బ్యాగులపై కూడా ఎన్నికల తేదీల్ని ముద్రించి ప్రచారం సాగించారు. ఇప్పుడు పాల ప్యాకెట్ల పైన ఎన్నికల తేదీని ముద్రిస్తున్నారు. 'మే 16న వంద శాతం పోలింగ్కు మీరు సిద్ధమా' అంటూ ఆవిన్ పాల ప్యాకెట్లపై తమిళంలో ముద్రించి అందరికీ అవగాహన కల్పిస్తోంది.
నేరుగా ప్రజల ఇళ్లలోకే ఈ సందేశం చేరేలా ఆ ప్యాకెట్లను ఉపయోగించుకుంటోంది. మామూలుగా ఏదైనా ప్రత్యేకమైన పండుగలు, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా శుభాకాంక్షల్ని తమిళనాడులో పాల ప్యాకెట్లపై ముద్రిస్తారు. అయితే ఇప్పుడు ఎన్నికల తేదీల ప్రచారానికీ ఈసీ ఈ పద్ధతినే వాడుకుంటోంది.