బీజేపీలోకి వీరప్పన్ కూతురు... తండ్రిపై సంచలన వ్యాఖ్యలు.. తల్లికి షాక్..ఇన్నాళ్లు ఎక్కడ?
గంధపుచెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు అడవిదొంగ వీరప్పన్. ఒకప్పుడు తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్ని గడగడలాడించిన ఆయనను 2004లో సిట్ బృందం మట్టుపెట్టింది. నేరాలతో సంబంధం ఉందని ఆరోపిస్తూ భార్య ముత్తులక్ష్మీపైనా పోలీసులు కేసులు పెట్టారు. వీరప్పన్ చనిపోయేనాటికి అతనికి ఇద్దరు కూతుళ్లు. ఆ ఇద్దరిలో పెద్దదైన విద్యారాణి(30) ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. సుమారు 3వేల మంది అనుచరులతో కలిసి బీజేపీలో చేరిన విద్యారాణి.. తండ్రిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇన్నాళ్లూ ఆమె ఎక్కడ, ఎలా ఉన్నారంటే...
కండువాకప్పిన మురళీధర్ రావు..
తెలంగాణకు చెందిన ప్రముఖ బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ప్రస్తుతం తమిళనాడు వ్యవహారాల ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. ఆంధ్రా-కర్నాటక-తమిళనాడు సరిహద్దులోని క్రిష్ణగిరి జిల్లా కేంద్రంలో శనివారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన.. వీరప్పన్ కూతురికి కాషాయకండువాకప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాక్రిష్ణన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. గతంలో వీరప్పన్ తో కలిసి పనిచేసినవాళ్లు, అతని ద్వారా మేలులు పొందినవాళ్లు సుమారు 3వేలమంది విద్యతోకలిసి బీజేపీలో చేరారు.
నా తండ్రిది తప్పుడు దారి..
‘‘మా నాన్న వీరప్పన్ ఎంచుకున్నది.. బతికున్నంతకాలం నడిచింది ముమ్మాటికీ తప్పుడు మార్గమే. ఆ విషయంలో నాకుగానీ, మా ఫ్యామిలీకిగానీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ.. ఆయన ఆ పని ఎందుకు చేశారన్నదే ఇక్కడ ప్రధానాంశం. చివరిశ్వాస వరకూ పేదల కోసమే బతికిన వ్యక్తి వీరప్పన్. ఇప్పటికీ కొన్ని వందల గ్రామాలు ఆయనను దేవుడిలా కొలుస్తాయంటే.. నాన్న ఎలాంటివారో అర్థంచేసుకోవచ్చు. బడుగుబలహీన వర్గాలు, అడవిబిడ్డలు బాగుండాలన్న ఆయన లక్ష్యాన్ని సాధించడానికే నేనివాళ బీజేపీలో చేరుతున్నాను'' అంటూ పార్టీలో చేరిన సందర్భంగా విద్యారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అడ్వొకేట్.. సామాజిక కార్యకర్త..
తండ్రి వీరప్పన్ చనిపోయినప్పుడు విద్యారాణి వయసు 14ఏళ్లు. తల్లి ముత్తులక్ష్మీని కూడా కేసులు వెంటాడటంతో.. చెల్లెలు ప్రభతొకలిసి ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ విద్య తన చదువు కొనసాగించింది. న్యాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసిన విద్య.. ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే, మరోవైపు సామాజిక కార్యకర్తగానూ పనిచేస్తూవచ్చారు. ఒకప్పుడు వీరప్పన్ హవా కొనసాగిన గ్రామాల్లోని పేదల సమస్యలపై విద్య తనదైన శైలిలో పోరాటాలు చేస్తున్నారు. 2011లో తన పెళ్లి విషయంలో హైకోర్టు దాకా వెళ్లిన ఆమె తొలిసారి పతాకశీర్షికలకెక్కారు. అప్పుడేమైందంటే..
తల్లిపై తీవ్ర విమర్శలు..
వీరప్పన్ చనిపోయిన తర్వాత ఆయన భార్య ముత్తులక్ష్మీ చాలా కాలంపాటు కేసులతో పోరాడారు. భర్త ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ జరిపించాలన్న ఆమె డిమాండ్ కు వివిధ స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలికాయి. తర్వాది కాలంలో పోలీసుల హింసకు వ్యతిరేకంగా ఆమె తన గళాన్ని వినిపించారు. ఈ క్రమంలో పెద్దకూతురు మెల్లగా తల్లికి దూరమైపోయింది. 2011లో విద్యారాణి.. మరియ దీపక్ అనే యువకుణ్ని రహస్యంగా పెళ్లిచేసుకుంది. దానికి తల్లి అడ్డుచెప్పడంతో ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో విద్య-దీపక్ పెళ్లికి చట్టబద్ధత ఏర్పడింది. ఆ సందర్భంలో తల్లిని ఉద్దేశించి విద్య తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లోనూ తళ్లీకూతుళ్లది వేర్వేరుపంథా..
అమ్మకు భిన్నంగా..
ప్రజల్లో వీరప్పన్ పట్ల ఉన్న సానుకూలత దృష్ట్యా ఆయన భార్య ముత్తులక్ష్మీ 2006లోనే రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఇండిపెండెంట్ గా పోటీచేసి ఓడిపోయారు. అయినాసరే జనం మధ్యే ఉంటోన్న ముత్తులక్ష్మీ.. 2018లో ‘మాన్ కక్కుమ్ వీరతమిళ పెరమైపు' పేరుతో ఉద్యమ సంస్థను ఏర్పాటుచేశారు. ఆ సంస్థ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటాలని ముత్తులక్ష్మీ భావిస్తుండగా.. పెద్ద కూతురు విద్యారాణి సడెన్ గా బీజేపీలో చేరడం, ఇన్నాళ్లూ ముత్తులక్ష్మీ వెంట నడచినవాళ్లలో చాలా మంది విద్యతో కలిసివెళ్లడం గమనార్హం.