టిక్టాక్ ఎంత పనిచేసింది.. వీడియోలు వద్దన్నందుకు...
పెరంబళూర్ : టిక్టాక్. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ అలరిస్తున్న యాప్. ఇందులో షార్ట్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంతో మంది సెలబ్రిటీలుగా మారారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపైతే.. టిక్టాక్ వ్యసనంగా మారడంతో కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. భార్య టిక్టాక్ చేస్తోందని ఈ మధ్యే ఓ భర్త ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన మరువక ముందే తమిళనాడులో మరో ఘోరం జరిగింది. పిల్లల్ని పట్టించుకోకుండా టిక్టాక్ వీడియోలు చేస్తున్న భార్యను భర్త మందలించడంతో మనస్థాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ చేసుకుంటూ వీడియో తీసి దాన్ని టిక్టాక్లో అప్లోడ్ చేయడం సంచలనంగా మారింది.
ఆందోళనకరంగా మిస్సింగ్ లు.. 9 రోజుల్లో 545 మంది అదృశ్యం .. అసలేం జరుగుతుంది
టైంపాస్ కోసం టిక్టాక్ వీడియోలు
తమిళనాడులోని అరియలూరు జిల్లా సెందురైలోని వంగారం గ్రామానికి చెందిన అనితకు కొన్నేళ్ల క్రితం పళనివేలుతో వివాహమైంది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. పళనివేలు సింగపూర్లో ఉద్యోగం చేస్తుండగా.. అనిత పిల్లలతో కలిసి పెరంబళూరులో ఉంటోంది. కొన్నాళ్ల క్రితం టిక్టాక్ గురించి తెలియడంతో అనిత టైం పాస్ కోసం వీడియోలు మొదలుపెట్టింది. అయితే రోజులు గడిచేకొద్దీ అది కాస్తా వ్యసనంగా మారింది.
వ్యసనంగా మారడంతో
అనిత డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ రకరకాల మేకప్లు వేసుకుంటూ ఇలా రకరకాల వీడియోలు టిక్ టాక్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. టిక్టాక్ మాయలో పడి పిల్లలను పట్టించుకోవడం మానేసింది. కొన్ని రోజుల క్రితం అనిత కూతురు కిందపడటంతో గాయాలయ్యాయి. అయినా ఆ విషయం పట్టించుకోని ఆమె చిన్నారిని హాస్పిటల్కు తీసుకెళ్లకుండా టిక్టాక్ వీడియోలు చేసుకుంది. బంధువులు ఈ విషయాన్ని అనిత భర్త పళనివేలుకి ఫోన్ చేసి చెప్పారు.
భర్త మందలించాడని
అనిత వ్యవహారం శ్రుతిమించడంతో పళనివేలు ఫోన్ చేసి భార్యను గట్టిగా మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అనిత ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. దాన్ని కూడా వీడియో తీసి టిక్టాక్లో పోస్ట్ చేసింది. విషయం తెలిసి స్థానికులు ఆమెను దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది.