గ్రేట్ ఆఫర్: ఆ హోటల్స్లో ప్రతి పార్శిల్ పై ఐదు శాతం డిస్కౌంట్
చెన్నై: పర్యావరణ పరిరక్షణ కోసం తమిళనాడు హోటల్ అసోసియేషన్ నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ బ్యాగులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదని ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలోనే తమిళనాడులోని రెస్టారెంట్లు తమ కస్టమర్లకు మంచి ఆఫర్ను ప్రకటించాయి. ఇకపై హోటళ్లనుంచి పార్శిల్ తీసుకెళ్లాలంటే....ఇంటినుంచి సొంత పాత్రలు తీసుకొస్తే బిల్లులో 5శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ ప్రకటించింది. ప్లాస్టిక్ కవర్స్ నిషేధం అమలు కోసమే ఇలాంటి ఆఫర్ ఇస్తున్నట్లు తమిళనాడు హోటల్ అసోసియేషన్ తెలిపింది.
తమిళనాడు హోటల్ అసోసియేషన్లో 10వేల మంది సభ్యులుగా ఉన్నారు. ఇకపై ఆహారం పార్శిల్ కోసం ప్లాస్టిక్ కవర్స్ను వినియోగించరాదంటూ తీర్మానం చేశారు. ప్రతి ఆహారం పార్శిల్పైనా అయ్యే బిల్లుపై సరాసరి 3శాతం నుంచి 4శాతం ఖర్చు అవుతుందని చెన్నై హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి తెలిపాడు. కస్టమర్లు పార్శిల్ కోసం తమ ఇంటి నుంచే పాత్రలు తీసుకొస్తే వారికే లాభిస్తుందని చెప్పారు. ఈ ఆఫర్ను తెలిసేలా ప్రతి హోటల్ బయట బోర్డు రాసి ఉంచాలని హోటల్ యజమానులకు తెలిపినట్లు రవి చెప్పాడు.
జనవరి 1, 2019 నుంచి తమిళనాడులో ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలవుతుందని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఈ ఏడాది జూన్ 5న ప్రకటించారు. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఆయన వేశారు. ప్లాస్టిక్ ఆధారిత వస్తువులపై నిషేధం విధించి... పర్యావరణహితంగా ఉండే అరిటాకులు, కమలం ఆకులు వినియోగించాలని కమిటీ సూచించింది.పాలు, పెరుగు, నూనె, మందులకు కూడా ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని తగ్గించాలని సూచించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్లాస్టిక్ పేపర్లు, కవర్లు, ప్లాస్టిక్ కప్పుల వినియోగం నిషేధించడం జరుగుతుంది. అంతేకాదు పరిశ్రమలు కూడా వీటి ఉత్పత్తిని నిలిపివేయడం జరుగుతుంది.
తమిళనాడును ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్ది భవిష్యత్ తరాలవారికి కానుకగా ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతోనే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని సీఎం పళని స్వామి చెప్పారు. ఇప్పటికే పలు రెస్టారెంట్లు ఆహారం పార్శిళ్ల కోసం అరిటాకులు, కమలం ఆకులు వినియోగిస్తున్నాయి.