వారం రోజుల్లో రెండో మరణం: నాగ్పూర్ నుంచి 500 కిలోమీటర్లు నడిచి మృతి చెందిన తమిళనాడు వ్యక్తి
హైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఈ వ్యాధి ప్రపంచదేశాలను చిగురుటాకులా వణికిస్తోంది. ఫలితంగా ఆయా దేశాలు సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించాయి. ఇక లాక్ డౌన్ ప్రకటనతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఆదుకుంటామని చెబుతున్నప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి సొంత గ్రామాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా లాక్డౌన్ సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ఎక్కడో సుదూర ప్రాంతాలకు కాలినడకనే వెళుతున్నారు. ఈ క్రమంలోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొద్దిరోజులు క్రితం ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్లోని తన సొంత గ్రామానికి కాలినడకన వెళుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మరువక ముందే తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి కన్నుమూశాడు.
నాగ్పూర్ నుంచి కాలినడకన 500 కిలోమీటర్లు..
కరోనావైరస్ కష్టాలు అంతా ఇంతకాదు. చెప్పుకుంటే కన్నీళ్లే తప్ప మరొకటి లేదు. దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో వలసకార్మికులు సొంతూళ్లకు బయలుదేరారు. వాహనాలు లేకపోవడంతో ఎన్నిరోజులైనా సరే కాలినడకనే బయలుదేరి ఇళ్లకు చేరుకుదామనే ఆలోచనతో సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి కాలినడకన వెళుతూ మృతి చెందాడు. తాజాగా తమిళనాడుకు చెందిన మరో 23 ఏళ్ల యువకుడు కూడా 500 కిలోమీటర్లు నడిచాక మృతి చెందాడు. తమిళనాడు నమక్కల్ ప్రాంతానికి చెందిన లోకేష్ బాలసుబ్రమణి నాగ్పూర్లో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ ప్రకటించడంతో లోకేష్ కూడా తన సొంతూరుకు కాలినడకన బయలుదేరాడు. అప్పటికే 500 కిలోమీటర్లు నడిచాడు. సికింద్రాబాదుకు చేరుకున్నాడు. అక్కడే ఒక షెల్టర్ హోమ్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఇక బుధవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలాడు లోకేష్.
వెస్ట్ మారెడ్ పల్లి షెల్టర్ హోమ్లో...
నాగ్పూర్ నుంచి తాము బయలుదేరామని గత మూడురోజులుగా తాము నడుస్తూనే ఉన్నట్లు సత్య అనే వ్యక్తి చెప్పాడు. తమకు లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డ్రైవర్లను పోలీసులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశఆడు. ఇదిలా ఉంటే నాగ్పూర్ - తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయని వెల్లడించాడు. తామంతా తమ లగేజీలు భుజాన వేసుకుని కాలినడకన బయలుదేరినట్లు సత్య చెప్పాడు. ఇక అంతా చూస్తుండగానే తమతో పాటు వచ్చిన లోకేష్ అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలడం షాక్కు గురిచేసిందన్నాడు. ఈరోజు లోకేష్కు జరిగిందని రేపు తమవంతు ఉండొచ్చని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. బోయిన్పల్లి దగ్గర లోకేష్ మరియు అతని స్నేహితులను మార్కెట్ యార్డు ఛైర్పర్సన్ కనుగొని వారిని వెస్ట్ మారెడ్పల్లి కమ్యూనిటీ హాల్కు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ 176 మంది వలసకూలీలు విశ్రాంతి తీసుకుంటున్నారు. రాత్రికి విశ్రాంతి తీసుకుని ఉదయం ఏదైనా వాహనంను ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు సత్య వెల్లడించాడు. ఇదిలా ఉంటే కొందరు వాహనం తీసుకుని బయలుదేరగా వారిని జడ్చర్ల దగ్గర పోలీసులు ఆపారని మరికొందరు సూర్యపేటలో నిలిచిపోయారని చెప్పారు.
ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేయాలంటూ..
లోకేష్ తన స్థలంలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా వెనక్కు పడిపోయాడని డాక్టర్ వచ్చి పరిశీలించి తను మృతి చెందినట్లు ప్రకటించాడని సత్య చెప్పారు. తామంత తమ ఇళ్లకు వెళ్లాలని అక్కడ వలసకూలీలు అర్థిస్తున్నారు. సహాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. ఒక వాహనం దొరికితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదని లేదంటే ఇలానే నడుచుకుంటూ ఇంటిని చేరే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇంత మంది గుంపులో ఉన్నా ఇబ్బందే అని వైరస్ తమకు సోకే అవకాశం ఉందని అందుకే తమ ఇళ్లను వెంటనే చేరే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పాడు సత్య. లోకేష్ మృతి గురించి తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మృతదేహాన్ని సొంతగ్రామానికి తరలించేందుకు ఏర్పాటు చేశారు.