నలుగురి భార్యల ముద్దుల మొగుడు.. గంగాధర ఏందీ కథ..!
చెన్నై : ఇద్దరు భార్యలున్నవారు సాధారణంగా తారసపడితే ఒక్క ఫ్యామిలీతోనే వేగలేకపోతున్నాం.. నువ్వేంటిరా బాబూ రెండు దుకాణాలు పెట్టేశావు అనే మాటలు తరచుగా వినిపిస్తుంటాయి. అలాంటిది ఓ ముద్దుల మొగుడు నలుగురు భార్యలను మెయిన్టెయిన్ చేస్తున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో కాపురం చేస్తున్నాడు. ఏళ్లకు ఏళ్లుగా గుట్టుగా సాగిన సదరు ముద్దుల మొగుడి లీలలు బయటపడటం చర్చానీయాంశమైంది.
దైవసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఒకరైతే.. మిగతా ముగ్గురిని మాత్రం నామమాత్రంగా పెళ్లి చేసుకున్నాడట. అయితే వీళ్లందరినీ ఎలా పోషిస్తున్నాడనేది మాత్రం పెద్ద ట్విస్ట్. ఒక్క ఫ్యామిలీతో నెట్టుకురావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇలా నలుగురు భార్యలతో కాపురం ఎలా చేస్తున్నాడబ్బా అనే కామెంట్లు కోడై కూస్తున్నాయి.
దుబాయ్లో ఉద్యోగం.. నాలుగు పెళ్లిళ్లు
తమిళనాడులోని మడకొట్టాన్ ఏరియాకు చెందిన గంగాధరన్ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే రామనాథపురం జిల్లా అళగన్కులం ప్రాంతానికి చెందిన కోమలదేవితో 2008లో వివాహం జరిగింది. ఆ క్రమంలో ఆయనతో పాటు భార్యను కూడా దుబాయ్ తీసుకెళ్లాడు. అలా కొన్నేళ్లు అక్కడ కాపురం కూడా పెట్టారు.
పెళ్లైన కొత్తలో బాగానే ఉన్న గంగాధరన్ ప్రవర్తనలో రానురాను మార్పు కనిపించింది. దుబాయ్లో ఉద్యోగం చేసే గంగాధరన్కు తరచుగా అక్కడ పబ్బులకు వెళ్లే అలవాటుంది. అలా లైఫ్ను ఎంజాయ్ చేస్తున్న గంగాధరన్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అవి కాస్తా భార్య దృష్టికి రావడంతో ఆమెను స్వస్థలానికి పంపే ఏర్పాట్లు చేశాడు.
పోలీసులకు ఏందీ దుస్థితి.. హైదరాబాద్ టు ఖమ్మం.. లీడర్ తిట్ల దండకం..! (వీడియో)
మొదటి భార్యకు తెలిసి.. కథ అడ్డం తిరిగింది
ఆ క్రమంలో కోమలదేవిని చెన్నైకి తీసుకొచ్చాడు. రామనాథపురం జిల్లా కేంద్రంలో ఓ పోర్షన్ అద్దెకు తీసుకుని అక్కడ ఉంచాడు. కొద్ది రోజుల తర్వాత తిరిగి దుబాయ్ వెళ్లిపోయాడు. ఇక కోమలదేవి స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే మధ్యమధ్యలో దుబాయ్ నుంచి వచ్చి కొద్దిరోజులు ఆమెతో గడిపి వెళ్లిపోయేవాడు గంగాధరన్.
అయితే ఇటీవల దుబాయ్ నుంచి రామనాథపురం చేరుకున్న గంగాధరన్ లీలలు వెలుగుచూశాయి. తననే కాదు మరో ముగ్గురిని ఆయన పెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు కోమలదేవి. అర్ధరాత్రి సమయంలో గంగాధరన్ ఫోన్కు ఓ మిస్డ్కాల్ వచ్చింది. ఆయన నిద్రపోతుండటంతో తిరిగి అదే నంబరుకు ఆమె కాల్ చేశారు. అవతలి వ్యక్తి మాట్లాడుతూ తాను గంగాధరన్ భార్యనంటూ చెప్పడంతో కోమలదేవి కంగుతిన్నారు.
ఒకరికి తెలియకుండా మరొకరితో పెళ్లి
మరునాడు ఆమె గురించి ఆరా తీశారు కోమలిదేవి. తను సేలం జిల్లాకు చెందిన కవితగా గుర్తించారు. అదే విషయం భర్త గంగాధర్ను నిలదీయగా అసలు తనకు కవిత ఎవరో తెలియదన్నట్లు యాక్టింగ్ చేశాడు. అదలావుంటే మరిన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కోమలిదేవి, కవితనే కాదు.. మరో ఇద్దరిని కూడా వివాహం చేసుకున్నట్లు తేలింది. చెన్నైకి చెందిన దీప, యమున అనే ఇద్దరు మహిళలను కూడా పెళ్లాడినట్లు తెలిసింది. దాంతో మొదటి భార్య కోమలిదేవికి చిర్రెత్తుకొచ్చింది.
గంగాధరన్ తనను వివాహం చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె రామనాథపురం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఒకరికి తెలియకుండా ఒకరిని అలా నలుగురిని పెళ్లి చేసుకోవడంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.