Tamilnadu Rains: కోయంబత్తూరులో కూలిన మూడు ఇళ్లు..15 మంది మృతి
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి స్కూళ్లకు, కాలేజీలకు యూనివర్శిటీలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. మద్రాస్ యూనివర్శిటీ మరియు అన్నా యూనివర్శిటీల్లో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు మేనేజ్మెంట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపాయి. ఇక పుదుచ్చేరిలో కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. సోమవారం రోజున తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కోయంబత్తూరులో కూలిన ఇళ్లు..15 మంది మృతి
తమిళనాడులో కురుస్తున్న భారీవర్షాలకు సముద్రంలో ఆరు మత్స్యకారుల బోట్లు ధ్వంసం అయ్యాయి. అవి తీరంను బలంగా వచ్చి తాకడంతో ధ్వంసం అయ్యాయి.మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలకు కోయంబత్తూరులో మూడు ఇళ్లులు కుప్పకూలాయి. మొత్తం 15 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలను శిథిలాల కింద నుంచి వెలికితీశారు అధికారులు . సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు చెన్నై లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఇక ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇబ్బందుల్లో ఉన్న ప్రజల కోసం టోల్ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసింది. రబ్బర్ బోట్లు, అత్యవసర కిట్, వాహనాలను అన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో జిల్లాలో 22 మంది రెస్క్యూ కమాండోలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇబ్బందులు ఉంటే 101కు ఫోన్ చేయాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఇక గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కు చేయాలనుకున్నవారు 044-28554309, 28554311, 28554314,28554376 ఈ నెంబర్లకు చేయాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది.
స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తిరువల్లూరు, తూతుకూడి, రామంతపురంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించాలని యాజమాన్యాలను కోరాయి. మరోవైపు చెంగల్పట్టు, కంచీపురం, కడలూరు, చెన్నైలలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఆదివారం రోజున రామేశ్వరంలోని నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది. మరో రెండు రోజుల పాటు ఇక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తతతో ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.
రోడ్లపై కాలం వెల్లదీస్తున్న ప్రజలు
రామేశ్వరంలో తెరిపివ్వకుండా వర్షాలు కురుస్తున్నాయని దేవి అనే మహిళ చెప్పింది. దీంతో వరదనీరు ఇళ్లల్లోకి వచ్చి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించడం లేదని తామంతా ఇళ్లను వీడి రోడ్డుపై ఉంటున్నట్లు వాపోయింది. ఇప్పటికే తమ ఇంటిలోకి నీరు వచ్చి చేరడంతో బయటకు పరుగులు తీశామని మరో వ్యక్తి చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి తమకు సహాయం చేయాలని అర్థించారు.