తమిళనాడులో కరోనా కల్లోలం: ఒక్కరోజే 798 పాజిటివ్ కేసులు
తమిళనాడులో కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్నాయి. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 798 కేసులు రికార్డవడంతో ఆందోళన నెలకొంది. దీంతో పాజిటివ్ వచ్చిన మొత్తం కేసుల సంఖ్య 8002కి చేరింది. 798 పాజిటివ్ కేసుల్లో రాజధాని చెన్నైలోనే 538 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది.
వైరస్ సోకి సోమవారం రోజున ఆరుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 53కి చేరింది. వైరస్ బారినపడి 2051 మంది కోలుకొని డిశ్చార్జయ్యారు. సోమవారం 92 మందిని ఇంటికి పంపించారు. మరో 5 వేల 898 మంది మాత్రం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు తర్వాత గుజరాత్లోనూ అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 347 కేసులు రికార్డయ్యాయి.
సోమవారం దేశవ్యాప్తంగా 4 వేల 200 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 69 వేల 400కి చేరింది. 21 వేల 664 మందికి వైరస్ తగ్గడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సోమవారం 694 మంది డిశ్చార్జ్ అయ్యారు. 45 వేల 478 మంది మాత్రం ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. వైరస్ సోకి మొత్తం 2 వేల 254 మంది చనిపోయారు. ఇవాళ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 41 మంది మృతిచెందారు.