తంబీలు ఎటువైపు: ఆ ఇద్దరు సమాధుల సాక్షిగా ఈ ఇద్దరు పునాదులు నిలబెట్టగలరా..?
చెన్నై: రెండు విడత పోలింగ్ ప్రచారం ముగిసింది. అన్ని చోట్లా మైకులు మూగబోయాయి. రెండో విడత పోలింగ్లో అస్సోం, బీహార్, చత్తీస్గఢ్, జమ్ముకశ్మీర్, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, తమిళనాడు, త్రిపురా, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాలు పాల్గొననున్నాయి. అయితే దక్షిణాదిలో తమిళనాడు రాష్ట్రంపై చాలామంది ప్రత్యేక దృష్టి సారించారు. ఇంతకీ తమిళనాడుపై ఎందుకంత ప్రత్యేదృష్టి... ఈ సారి తమిళనాడు ఎన్నికలు ఎందుకు ప్రత్యేకంగా నిలిచాయి..?
ఇద్దరు దిగ్గజాలు లేకుండా తొలిసారి తమిళనాడులో లోక్సభ ఎన్నికలు
తమిళనాడు...దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే రాష్ట్రం. దక్షణాది రాష్ట్రాల్లో రాజకీయంగా భిన్నంగా వ్యవహరించే రాష్ట్రం. ఈ సారి తమిళనాడు ఎన్నికలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో వ్యూహ ప్రతి వ్యూహాలు అమలు చేసేవారు దివంగత నేతలు కరుణానిధి, జయలలిత. ఇద్దరూ కాలం చేసిన తర్వాత ఆ స్థాయిలో వ్యూహ ప్రతి వ్యూహాలు చేసే నేతలు రెండు ప్రధాన పార్టీలకు లేరనే చెప్పాలి. పార్టీ అభ్యర్థులు ఎవరున్నా... కరుణానిధి, జయలలితలే ఆపార్టీకి స్టార్లుగా వెలుగొందారు. ప్రస్తుతం వీరిలేని లోటు రెండు పార్టీల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
స్టాలిన్కు పళనిస్వామిలకు ఎన్నికలు అగ్నిపరీక్షే
జయలలిత మృతి తర్వాత అధికార అన్నాడీఎంకే పార్టీలో ఎన్నో లుకలుకలు. అసలు ప్రభుత్వం ఉంటుందా లేదా అన్న అనుమానం ఉన్నరోజులవి. ఒక్క పార్టీలోనే మూడు వర్గాలు తయారవడంతో ఒక్కసారిగా ఆరాష్ట్రంలో పాలన గాడి తప్పింది. దీన్నే అదనుగా తీసుకుని డీఎంకే రాష్ట్రంలో పుంజుకుంది. ఆ తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్లు కొత్త పార్టీలతో ముందుకొచ్చారు. అయితే రజనీకాంత్ ఈసారి ఎన్నికలకు పోటీ నుంచి దూరంగా ఉంటున్నప్పటికీ... కమల్ హాసన్ మాత్రం పోటీలో తన అభ్యర్థులను నిలబెట్టారు.
ఇక తమిళనాడులో ఇద్దరు రాజకీయ ఉద్దండులు కరుణానిధి, జయలలితలు కాలం చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో తొలిసారిగా చోటుచేసుకున్న అంశాలను పరిశీలిస్తే ..... తమిళనాడు రాష్ట్రం తొలిసారిగా లోక్సభ ఎన్నికలకు వెళుతోంది. ఈ ఎన్నికల్లో కరుణానిధి కుమారుడు డీఎంకే అధినేత స్టాలిన్కు కఠిన పరీక్షగానే నిలుస్తాయి.ఇక ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి , డిప్యూటీ సీఎం పనీర్ సెల్వంలకు కూడా అగ్నిపరీక్షగానే ఈ ఎన్నికలు నిలవబోతున్నాయి.ఇక బరిలో చాలా పార్టీలు నిలుస్తున్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అన్నాడీఎంకే - బీజేపీ ,డీఎంకే-కాంగ్రెస్ పొత్తుల మధ్యే ఉంది. అయితే టీటీవీ దినకరన్ పార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. దినకరన్తో పాటు కమలహాసన్ పార్టీ ఎంఎన్ఎం కూడా ఓట్లను చీల్చే అవకాశం కనిపిస్తోంది.
ఓట్లు చీల్చనున్న దినకరన్, కమల్ హాసన్లు
ఏప్రిల్ 18న జరిగే 39 లోక్సభ స్థానాలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు కూడా తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఇక అధికారంలో పూర్తి స్థాయిలో ఉండాలంటే అన్నాడీఎంకే ఐదు అసెంబ్లీ సీట్లను ఎట్టిపరిస్థితుల్లో గెలవాల్సి ఉంది. ఇక భవిష్యత్తులో అన్నాడీఎంకే ఒంటరిగానే పోటీ చేస్తుందని 2014లో జయలలిత ప్రకటించినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ బీజేపీతో కలిసి పయనించడం విశేషం.ఇక అన్నాడీఎంకే డీఎంకే పార్టీలు రెండు జాతీయ పార్టీలతో కలిసి పొత్తుతో వెళుతున్నప్పటికీ అన్నాడీఎంకే డీఎంకేల మధ్య ప్రత్యక్ష పోరు మాత్రం 8 స్థానాల్లోనే ఉంటోంది.ఇదిలా ఉంటే టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకే కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎంలు మొత్తం 39 లోక్సభ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. దీంతో ఈ పార్టీలు భారీగా ఓట్లు చీల్చనున్నాయి. ఇక కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే తమిళనాడులోని పార్టీల గెలుపు పైనే రెండు జాతీయ పార్టీలు ఆధారపడ్డాయి.