చరిత్రలో మొట్టమొదటిసారి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్జెండర్..
తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ ట్రాన్స్జెండర్ విజయం సాధించింది. నమ్మకల్ జిల్లా తిరుచెంగొడె పట్టణంలో డీఎంకె తరుపున పోటీ చేసిన రియా(30) 950 ఓట్ల మెజారిటీతో యూనియన్ కౌన్సిలర్గా గెలుపొందింది. 2017 నుంచి డీఎంకెలో కొనసాగుతున్న రియా.. తన విజయాన్ని డీఎంకె అధినేత స్టాలిన్కు అంకితమిచ్చింది. కౌన్సిలర్గా ప్రమాణస్వీకారానికి ముందు కలైగ్నర్ కరుణానిధి సమాధి వద్దకు వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుంటానని రియా తెలిపింది. అలాగే స్టాలిన్ను కలిసి ఆయన ఆశీస్సులు కూడా తీసుకుంటానని వెల్లడించింది. ఇది తాను ఒక్కదాన్ని సాధించిన విజయం కాదని,మొత్తం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సాధించిన విజయమని అభిప్రాయపడింది. ఎన్నికల్లో తనను గెలిపించినందుకు తిరుచెంగొడె పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల్లో రియాకు మొత్తం 2701 ఓట్లు పోల్ అవగా.. ఆమె ప్రత్యర్థి అన్నాడీఎంకె అభ్యర్థి కందమ్మాల్కి 1751 ఓట్లు పోల్ అయ్యాయి. కౌన్సిలర్గా తాను మొదట చేయబోయే పని.. తాగునీటి సమస్య లేకుండా చేయడమని చెప్పారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని,దాన్ని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. అలాగే రోడ్లు,ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానన్నారు.
గతంలో డీఎంకె ఎంపీ కనిమొళి తరుపున లోక్సభ ఎన్నికల్లో రియా ప్రచారం చేసింది. అందుకే తన రోల్ మోడల్ కనిమొళినే అని రియా చెబుతుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కనిమొళియే తనను ప్రోత్సహించారని చెప్పింది. ఒక మహిళగా రాజకీయాల్లో ఎన్నో విజయాలు సాధించిన కనిమొళి తనకు ఆదర్శం అని చెప్పింది. కౌన్సిలర్గా గెలిచిన తర్వాత కనిమొళి తనకు ఫోన్ చేసి అభినందించినట్టు వెల్లడించింది.
కాగా,తమిళనాడులో గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 27,30 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అన్నాడీఎంకె కంటే డీఎంకె చాలాచోట్ల ముందు వరుసలో ఉంది.