భర్త ముందు దీపం పెట్టి.. అతని భార్యపై రేప్ చేశాడు: దొంగ బాబాకు 25ఏళ్ల జైలు
మధుర: రోగం నయం చేస్తానని క్షుద్రపూజల పేరిట ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడిన దొంగ బాబాకు ఉత్తరప్రదేశ్లోని ఓ న్యాయస్థానం 25ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.27వేల జరిమానా కూడా విధించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. హత్రాస్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధ పడుతోంది. బృందావన్లోని ద్వారకాదాస్ ఆశ్రమానికి వెళితే ఫలితం ఉంటుందని తెలిసిన వారు చెప్పడంతో.. ఆమె తన భర్తతో కలిసి గత జూలైలో ఆ ఆశ్రమానికి వెళ్లింది.
రోగాన్ని నయం చేస్తానంటూ క్షుద్రపూజల పేరిట సదరు మహిళ భర్తను ఓ దీపం ముందు కూర్చోబెట్టాడు.. అది ఆరిపోయే వరకు పైకి రాకూడదని హెచ్చరించాడు. ఆ తర్వాత పై అందస్తులో ఉన్న గదికి అతని భార్యను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది దుష్టశక్తులను తరిమికొట్టే ప్రయత్నంలో భాగమని.. ఎవరికైనా ఈ విషయం చెబితే నీ కుటుంబం మొత్తం సర్వనాశనమవుతుందని ఆమెను హెచ్చరించాడు ఆ దొంగ బాబు.
కాగా, మరికొన్ని రోజుల తర్వాత ఆమెను మరోసారి బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో అతని వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ.. తన భర్తకు విషయం చెప్పింది. దీంతో వారిద్దరూ కలిసి దొంగ బాబాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కోర్టు ముందు హాజరుపర్చారు. కేసు విచారించిన మధుర ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. దొంగ బాబా ద్వారకాదాస్కు 25ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.27వేల జరిమినా విధించింది. ఒక వేళ జరిమానా కట్టకపోతే మరో 27నెలలు అదనంగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.