టాంజానియా యువతి, వివస్త్ర: 'నల్లగా ఉన్నందువల్లే'
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో టాంజానియా యువతి పైన జరిగిన ఘోరం సంచలం రేపుతోంది. భారత్లో టాంజానియా హై కమిషనర్ జాన్ కిజాజి మాట్లాడుతూ.. బాధితురాలు నల్లగా ఉండటం వల్లనే ఈ దారుణం జరిగిందని, ఇది జాత్యాంహకార దాడి అని ఆరోపించారు.
బెంగళూరులో గత ఆదివారం టాంజానియా విద్యార్థినిపై జరిగిన దాడి పెద్ద వివాదంగానే మారేలా కనిపిస్తోంది. ఎవరో కారుతో ఢీకొట్టి వ్యక్తి మరణానికి కారణమైతే... స్నేహితులతో కలిసి అటుగా వెళుతున్న టాంజానియా విద్యార్థినిపై బెంగళూరువాసులు దారుణానికి తెగబడ్డారు.
ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేసి నగ్నంగా పరుగులు పెట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై టాంజానియా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బెంగళూరువాసుల దారుణ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్కు చెప్పింది.
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో పాటు టాంజానియా, మరిన్ని దేశాల దౌత్యాధికారుల బృందం నేడు బెంగళూరుకు వెళ్లనుంది. ఘటనపై సమగ్ర వివరాలు సేకరించడంతో పాటు నిందితులపై తీసుకోవాల్సిన చర్యలపైనా వారు బెంగళూరు పోలీసులతో చర్చించనుంది.
దాడి జరుగుతుంటే పోలీసులు పారిపోయారు
తనపై జరిగిన దాడి పై బాధితురాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు చూస్తుండిపోయారని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని కూడా చెప్పింది.