ఆ బాధ్యత చేపట్టేందుకు సిద్ధం : మనసులో మాట బయటపెట్టిన శశి థరూర్
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్య నెలకొంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానంటూ రాహుల్ గాంధీ స్పష్టంచేయగా .. ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. అయితే కొత్తగా శశిథరూర్ తమ లీడర్ రాహుల్ అంటూనే తన మనసులోని మాటను బయటపెట్టారు.
సమర్థుడే ..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ వందశాతం చక్కగా పనిచేశారని కొనియాడారు థరూర్. ఓటమికి నేతలు నైతిక బాధ్యత వహించరని .. కానీ రాహుల్ తన భుజాలపై అపజయాన్ని మోస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయగల సత్తా, సమర్థత రాహుల్కే ఉందని అభిప్రాయపడ్డారు. కానీ కొందరు పనిగట్టుకొని అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సరికాదని తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.
నేను ఓకే కానీ ...
కాంగ్రెస్ అధ్యక్ష పదవీ చేపట్టేందుకు రాహుల్ ససేమిరా అంటుంటే .. లోక్సభలో ఆ పార్టీ నేతగా ఉండేందుకు తాను సిద్ధమని సంకేతాలిచ్చారు శశిథరూర్. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే ప్రతిపక్ష నేతగా పనిచేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు. థరూర్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పెద్దలు పరిశీలించాల్సి ఉంది. ఆయన వైపు హైకమాండ్ మొగ్గుచూపే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం ...
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని థరూర్ స్పష్టంచేశారు. 130 ఏళ్ల నుంచి దేశం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో రాహుల్ ముందుంటారని అభిప్రాయపడ్డారు. అధ్యక్ష పదవీకి ఓటింగ్ పెట్టిన .. రాహుల్ను ఓడించడం కష్టమని పేర్కొన్నారు. అందరినీ కలుపుకొని పోయి, పార్టీని ముందుకు నడపడంలో రాహుల్ గాంధీని మించిన నేత కాంగ్రెస్ పార్టీలో లేరన్నారు.