తరుణ్ తేజ్పాల్ సెల్లో మొబైల్ ఫోన్, సౌకర్యాల తగ్గింపు
గురువారం సబ్ జైలు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యులను కలిసే విషయంలో, క్యాంటీన్, టెలిఫోన్ ఉపయోగించే విషయంలో సౌకర్యాలు తగ్గించినట్లు అందులో పేర్కొన్నారు. తరుణ్ సెల్లో దొరికిన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
తరుణ్ బెయిల్ పిటిషన్ పైన బాంబే హైకోర్టు మార్చి నాలుగున విచారణ జరపనుంది. తరుణ్ తేజ్పాల్ను అతని న్యాయవాది కలుసుకోవచ్చునని జైలు అధికారులు చెప్పారు.
కాగా, మహిళా ఉద్యోగినిపై అత్యాచారం చేశాడని తెహెల్కా మాజీ చీఫ్ తరుణ్ తేజ్పాల్పై గోవా పోలీసులు అభియోగం మోపిన విషయం తెలిసిందే. సోమవారం ఈ మేరకు వారు చార్జిషీట్ దాఖలు చేశారు. ఆయనపై నిరుడు నవంబర్ 22వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. గోవాలోని హోటల్ లిఫ్ట్లో మహిళా ఉద్యోగిపై తరుణ్ తేజ్పాల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2013 నవంబర్లో తెహెల్కా థింక్ ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
తేజ్పాల్పై దాఖలు చేసిన చార్జిషీట్ 2,846 పేజీలు ఉంది. అందులో 132 పేజీలు ప్రధాన చార్జిషీట్ కాగా, 30 పేజీలు సాక్షులకు సంబంధించినవి. అనుబంధాలతో కలిపి మొత్తం 2,846 పేజీల చార్జిషీట్ను పోలీసులు దాఖలు చేశారు. పోలీసులు 152 మంది సాక్షు వాంగ్మూలాలను నమోదు చేశారు.
వారిలో దర్యాప్తు అధికారి సునీత సావంత్ వాంగ్మూలం కూడా ఉంది. బాధితురాలు అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైందని, హోటల్లోని లిఫ్ట్లో ఆమె గౌరవానికి భంగం వాటిల్లిందని నిరూపించడానికి తమ వద్ద తగిన ఆధారాలున్నాయని పోలీసులు చార్జిషీట్లో తెలిపారు.