పవన్కళ్యాణ్, చంద్రబాబు: సీమాంధ్రకి మోడీ భారీ ప్యాకేజీ
న్యూఢిల్లీ: బిజెపి, టిడిపి మిత్రుత్వం నేపథ్యంలో కేంద్రం నుండి సీమాంధ్ర ప్రాంతానికి భారీ ప్యాకేజీ వచ్చే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన హామీలు, సీమాంధ్రకు న్యాయం చేస్తామని బిజెపి చెప్పడం, మిత్ర పక్షం టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం.. వంటి పలు కారణాల వల్ల సీమాంధ్రకు మోడీ హయాంలోని కేంద్రం నుండి నిధుల వరద పారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
విభజన తీరు పైన.. బిజెపి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలి ప్రచారంలో తమకు బాగా ఉపయోగపడిన పవన్కు బిజెపి చాలా ప్రాధాన్యతనిస్తోంది. దీనిని ఇలాగే కంటిన్యూ చేసే అవకాశముంది. సీమాంధ్రకు న్యాయం కోసం పవన్ కళ్యాణ్ కూడా మోడీ నుండి భారీ ప్యాకేజీ ఆశిస్తున్నారనే చెప్పవచ్చు.
గంగానదితోపాటు దేశం మొత్తాన్నీ శుద్ధి చేయాల్సి ఉందని ఇటీవల వారణాసిలో విజయోత్సవ సభలో ప్రసంగించిన మోడీ ముందు భారీ లక్ష్యాలు ఉన్నాయి. పాలనతో తనదైన ముద్ర వేసి దేశాన్ని అభివృద్ధి బాటలో నడపడంపై దృష్టి పెట్టిన మోడీ... పలు కీలక అంశాలపై కేంద్రీకరించారు. అభివృద్ధి చర్యలు, ఉగ్రవాద నిరోధం, ఇంటెలిజెన్స్ వ్యవస్థలో మార్పులు, దేశం పరువు తీస్తున్న నల్లధనం పట్ల కఠినంగా వ్యవహరించడం వంటి అనేక అంశాలు ఆయన ముందు ఉన్నాయి.
ముఖ్యంగా దక్షిణాది నుంచి ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపి అధికారంలోకి వచ్చిన సీమాంధ్ర ప్రాంతంపై కూడా మోడీ ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా రెండు రాష్ట్రాలు వేర్వేరుగా ఏర్పడనున్న నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టే హోంమంత్రి రాష్ట్ర విభజనపై దృష్టి పెట్టడం కీలక బాధ్యతగా ఉంది. హోంశాఖ కాలంతో పోటీ పడి పరుగులు తీస్తూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనను పూర్తి చేయడంతోపాటు సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ రూపొందించడం ఆ శాఖ ముందుంది.
సీమాంధ్రలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆ ప్రాంతానికి భారీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని అంటున్నారు. సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, మోడీ సుమారు 30 నిమిషాలపాటు సమావేశమైనప్పుడు ఈ ప్రాధాన్యత అంశం చర్చకు వచ్చిందని అంటున్నారు.
ఇదిలా ఉండగా... హోంశాఖను రెండుగా విభజిస్తారని, అంతర్గత భద్రత విభాగం మాత్రం ప్రధాన మంత్రి కార్యాలయ పరిధిలోనే ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఇంకా కచ్చితంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదంటున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపనున్న మోడీ.. సరికొత్త ఉగ్రవాద నిరోధక చట్టాన్ని తీసుకొచ్చే అవకాశముంది.
సీనియర్ పోలీస్ అధికారుల ముందు నిందితుని వాంగ్మూలం ఇక నుంచి చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేలా, దాని ద్వారా నిందితుడు నేరానికి పాల్పడినట్లు వచ్చే అంచనాతో ఆ వ్యక్తికి బెయిల్ మంజూరు కష్టసాధ్యమయ్యేలా ఈ చట్టం ఉంటుందని అధికారులు అన్నారు. గుజరాత్ ప్రతిపాదించిన ఉగ్రవాద నిరోధక చట్టానికి కేంద్రం అనుమతి 2003 నుంచి పెండింగ్లో ఉంది.