సర్వం కోల్పోయిన ఉద్యోగులకు 1,100 కోట్లు: టీసీఎస్
చెన్నై: ఇటీవల చెన్నైలో కురిసిన భారీ వరదలు, వర్షాలకు అటు సామాన్యులతో పాటు ఐటీ ఉద్యోగులు సైతం సర్వం కోల్పోయారు. వరదలకు టీసీఎస్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడటం టీసీఎస్ యాజమాన్యాన్ని కదిలించి వేసింది.
పలువురి ఉద్యోగుల ఇళ్లలోని సామాన్లు పాడైపోవడం, వాహనాలు, ఆస్తులు ధ్వంసం కావడంతో అలాంటి వారిని ఆదుకునేందుకు రూ. 1,100 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వడ్డీ రహిత క్యాష్ అడ్వాన్సుల రూపంలో ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
ఒక్కో ఉద్యోగి కనీసం రూ. లక్ష నుంచి గరిష్ఠంగా మూడు నెలల స్థూల వేతనం వరకూ అడ్వాన్స్ పొందవచ్చని సంస్థ ఉద్యోగులకు ఇంటర్నెల్ కమ్యూనికేషన్ పోర్టల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
ఇందులో తమ ఉద్యోగులు నష్టపోవడం కదిలించి వేసిందని ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వారు కోలుకోవాలన్నదే తమ అభిమతమని, చెన్నైలోని టీసీఎసర్లను ఆదుకునేందుకు ఎంతైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
100 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వరద రాలేదని గుర్తు చేసుకున్న ఆయన, కష్టకాలంలో తమ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఇళ్లలో పూర్తి నష్టం జరిగిన వారికి అదనంగా నెల వేతనం ఇవ్వదలిచామని, ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన వారి ఖర్చంతా భరిస్తామన్నారు.
ఉద్యోగులు వాహనాలు పాడైపోయినందున డిసెంబర్ 31 వరకూ ప్రతి ఒక్క ఉద్యోగినీ ఉచితంగా ఆఫీసుకు బస్సు సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. దీంతో పాటు ఉద్యోగులకు పిల్లలకు సైతం ఉచితి మెడికల్ క్యాంపులను నిర్వహించనున్నట్టు తెలిపారు. కాగా, చెన్నై చుట్టుపక్కల టీసీఎస్ 13 సెంటర్లను నిర్వహిస్తుండగా, వీటిల్లో 60 వేల మంది ఉద్యోగులు విధులను నిర్వహిస్తున్నారు.