15వ అంతస్తు నుంచి దూకి టాటా మోటార్స్ మాజీ ఎండీ ఆత్మహత్య
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటామోటార్స్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని పరేల్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ సిబల్.. తన అపార్ట్మెంట్ 15వ అంతస్తు నుంచి దూకి చనిపోయారు.
ముంబై: ఆటోమొబైల్ తయారీ దిగ్గజం టాటామోటార్స్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని పరేల్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ సిబల్(43).. తన అపార్ట్మెంట్ 15వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.
టాటామోటార్స్లో ప్రశాంత్ సేల్స్ విభాగానికి జనరల్ మేనేజర్గా పని చేశారు. గత ఏప్రిల్లో ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం ప్రశాంత్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రశాంత్ గది నుంచి సూసైడ్ నోట్ను వారు స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని అందులో సిబల్ పేర్కొన్నట్లు తెలిసింది. కాగా, సంస్థ తనను ఉద్యోగం నుంచి తొలగించటంతో డిప్రెషన్కు గురై ఆత్మహత్య చేసుకున్నారని ప్రశాంత్ భార్య ఆరోపిస్తున్నారు.
అయితే టాటామోటార్స్ ప్రతినిధులు మాత్రం ఆయన వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని, ఉద్యోగం నుంచి తొలగించలేదని చెబుతున్నారు. పోలీసుల విచారణకు తాము సహకరిస్తామని టాటామోటార్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో టాటా మోటార్స్ 1000 మంది ఉద్యోగాలకు కోత విధించింది. మరికొందరికి వాలెంటరీ రిటైర్మెంట్ అవకాశాన్ని కల్పించింది.