సైరస్ మిస్త్రీ చేసింది క్షమించరాని నేరం: టాటా సన్స్
ముంబై: సైరస్ మిస్త్రీ ఆరోపణల పైన టాటా సన్స్ స్పందించింది. తన చేతులు కట్టేశారని, తనకు అధికారాలు ఇవ్వలేదని మిస్త్రీ మెయిల్ పెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఆరోపణలు తప్పుడివి అని టాటా సన్స్ కొట్టి పారేసింది. సైరస్ మిస్త్రీ చేసిన ఏ ఆరోపణలకు కూడా ఆధారాలు లేవని చెప్పింది.
తనను తాను రక్షించుకునేందుకు చేసిన చర్య ఇది అని ప్రకటించింది. ఆయన బోర్డు సభ్యుల విశ్వాసం కోల్పోయారని పేర్కొంది. ఈ అంశాన్ని ఒక దురదృష్టకర పరిణామంగా పేర్కొంది. ఛైర్మన్ మార్పు అనే అంశం బోర్డు సభ్యులు అందరూ కలిసి తీసుకునే నిర్ణయం అని తెలిపింది.
అవకాశాలు, సవాళ్ల నిర్వహణ అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఛైర్మన్కు బోర్డు అధికారాలు ఇస్తుందని చెప్పింది. సైరస్ మిస్త్రీ అనవసర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.
టాటా సన్స్ బోర్డు తన చైర్మన్కు అవకాశాలను సమన్వయం చేసుకునేందుకు, సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన స్వయం అధికారాన్ని ఇచ్చిందని, కానీ కంపెనీ విలువలకు, పద్ధతికి మిస్త్రీ దూరంగా జరిగారని, మొత్తానికి పలు కారణాల మూలంగా మిస్త్రీ బోర్డు సభ్యుల విశ్వాసం కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొంది. మిస్త్రీ కంపెని ప్రతిష్టను ఉద్యోగుల దృష్టిలో కళంకితం చేశారు. అది క్షమించరాదనిదని కూడా పేర్కొంది.