సైరస్ మిస్త్రీ వ్యవహారం: ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకు టాటా గ్రూప్
ముంబై: గత నెలలో టాటాసన్స్ గ్రూప్ డైరెక్టరుగా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలంటూ ట్రైబ్యునల్ చెప్పిన తీర్పును సవాల్ చేస్తూ టాటా సన్స్ గ్రూప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు ఉన్నాయి. జనవరి 6వ తేదీన సుప్రీంకోర్టు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. అయితే కోర్టు రిజిస్ట్రీ మాత్రం పనిచేస్తుంది. ఇదిలా ఉంటే గత నెలలో సైరస్ మిస్త్రీని తొలగించడం సరికాదని చెబుతూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వగా ... ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని అప్పుడే టాటా సన్స్ గ్రూప్ కంపెనీ ప్రకటించింది.
మిస్త్రీకి బాధ్యతలు అప్పగించాలంటూ ట్రైబ్యునల్ తీర్పు
సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్ను విచారణ చేసిన జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం టాటా సన్స్ గ్రూప్కు షాకిస్తూ మరో రూలింగ్ చేసింది. ప్రైవేట్ కంపెనీగా ఉన్న టాటా సన్స్ గ్రూప్ను పబ్లిక్ కంపెనీకిందకు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించింది. ఇది భారత చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. అదే సమయంలో సైరస్ మిస్త్రీని 2016లో తొలగించడాన్ని తప్పుబట్టిన ట్రైబ్యునల్... తిరిగి మిస్త్రీకి బాధ్యతలు కట్టబెట్టాలని ప్రస్తుత ఛైర్మెన్ ఎన్.చంద్రశేఖరన్కు ఆదేశాలు జారీ చేసింది.
తీర్పును స్వాగతించిన మిస్త్రీ
తను తిరిగి ఛైర్మెన్గా బాధ్యతలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తన పిటిషన్లో కోరనప్పటికీ... ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ టాటా సన్స్ గ్రూప్లో పాలనా పరమైన విధానాలకు తూట్లు పడకుండా ఉండేలా తీర్పు ఉందని సైరస్ మిస్త్రీ కొనియాడారు. అదే సమయంలో మైనార్టీ షేర్హోల్డర్ల హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా తీర్పు ఉందని ప్రశంసించారు.
ట్రైబ్యునల్ పరిధి మించి వ్యవహరించింది
మరోవైపు సుప్రీంకోర్టులో ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన టాటా సన్స్ గ్రూప్... మిస్త్రీ కోరని అంశాలపై కూడా తీర్పు ఇచ్చి ట్రైబ్యునల్ పరిధిని దాటిందని పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు జనవరి 9న టాటా కన్సల్టెన్సీ బోర్డు మీటింగ్ ఉన్నందున ట్రైబ్యునల్ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా కూడా పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పలు అంశాలపై క్లారిటీ కోరిన ట్రైబ్యునల్
నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్లో సైరస్ మిస్త్రీ కేసు విచారణ సందర్భంగా టాటా సన్స్ తరపున వాదనలు వినిపించిన లాయరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ధృవీకరించారు. సైరస్ మిస్త్రీని తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఆర్డర్ను పునఃపరిశీలించాలంటూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దాఖలు చేసిన పిటిషన్ పై ట్రైబ్యునల్ విచారణ చేసింది.
కంపెనీల చట్టం కింద ఉన్న ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ కంపెనీలు అంటే ఏమిటో వాటి నిర్వచనం ఏమిటో తెలపాలని ట్రైబ్యునల్ కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఆదేశాలిచ్చింది. అంతేకాదు క్యాపిటల్ అవసరాలు అంటూ ఏమిటో కూడా స్పష్టత ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.