షాకింగ్: 5000 మంది ఉద్యోగులకు ‘టాటా’!
టాటా గ్రూప్ తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. గత 21 ఏళ్లుగా నడుస్తోన్న ఫోన్ సర్వీసు వెంచర్.. టాటా టెలిసర్వీసెస్కు త్వరలోనే గుడ్బై చెప్పబోతుంది.
ముంబై : టాటా గ్రూప్ తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. గత 21 ఏళ్లుగా నడుస్తోన్న ఫోన్ సర్వీసు వెంచర్.. టాటా టెలిసర్వీసెస్కు త్వరలోనే గుడ్బై చెప్పబోతుంది. ఈ క్రమంలో ఆ విభాగానికి చెందిన మెజారిటీ ఉద్యోగులను ఇంటికి పంపేస్తోంది.
టాటా గ్రూప్ వార్షిక నివేదిక ప్రకారం.. 2017 మార్చి వరకు టాటా టెలిసర్వీసులో 5,101 మంది ఉద్యోగులున్నారు. ఇప్పుడు ఈ మూసివేత ప్రక్రియలో భాగంగా దాదాపు 5000 మంది ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల నోటీసు ఇస్తోంది.
పెద్ద వారికి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్)ను, కొంతమంది ఉద్యోగులను మాత్రమే ఇతర గ్రూప్ కంపెనీలకు టాటా గ్రూప్ బదిలీ చేస్తోంది. ఎవరైతే ముందస్తుగా కంపెనీని వీడి వెళ్లాలనుకుంటారో వారికి సెవరెన్స్ ప్యాకేజస్ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
నష్టాల్లో కూరుకుపోయిన తమ టెలికాం కంపెనీని త్వరలోనే మూసివేయబోతున్నాని కంపెనీ ఎగ్జిక్యూటివ్లు, ఇండస్ట్రి ఇన్సైడర్స్ తెలిపారు. టాటా గ్రూప్ ఎల్లవేళలా తమ ఉద్యోగులను కాపాడుతుందని, కానీ ఈసారి కొద్ది మందిని మాత్రమే ఇతర గ్రూప్ కంపెనీల్లోకి పంపుతున్నామని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
నైపుణ్యాలకు తగ్గ వారిని మాత్రమే బదిలీ చేస్తున్నామని, సీనియర్ ఉద్యోగులకు వచ్చే నెలల్లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ను ఆఫర్ చేస్తున్నామని టాటా గ్రూప్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.