సైరస్మిస్త్రీకి మరో ఎదురుదెబ్బ... టాటా సన్స్ ఇక ప్రైవేట్ లిమిటెడ్
టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారనుంది. ఇది జరగకుండా చేయడానికి సైరస్ మిస్త్రీ చాలా ప్రయత్నించారు కానీ, ఆయన పాచికలేమీ
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారనుంది. ఇది జరగకుండా చేయడానికి సైరస్ మిస్త్రీ చాలా ప్రయత్నించారు కానీ, ఆయన పాచికలేమీ పారలేదు.
గురువారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో టాటా సన్స్ను పబ్లిక్ లిమిటెడ్ ప్రతిపత్తి నుంచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చాలన్న ప్రతిపాదన రాగా, ఇందుకు సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం ఆమోదముద్ర వేసింది.
మిస్త్రీ పాచికలు పారలేదు...
ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ వాటాదారుల నుంచి మద్దతు కోసం ఆఖరు క్షణం వరకు తన ప్రయత్నాలు సాగించినా చివరికి ఆయనకు పరాభవమే ఎదురైంది. ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చడం వల్ల నిర్ణయాల్లో మరింత వేగం ఉంటుందని, నాన్పుడు అవకాశం ఉండదని విశ్లేషకులు అంటున్నారు.
స్వాతంత్ర్యం రాకమునుపే ప్రారంభం...
స్వాతంత్ర్యం రాకమునుపే 1913లో టాటా సన్స్ కంపెనీల చట్టం కింద ఏర్పాటైంది. టాటా గ్రూప్లోని వందకు పైగా ఉన్న కంపెనీలకు ఇదే హోల్డింగ్ కంపెనీ. టాటా పేరు, ట్రేడ్మార్క్లకు కూడా టాటాసన్స్ సొంతదారుగా ఉంది.
ఆ షేర్ హోల్డర్లకూ ఓటింగ్ హక్కు?
ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్లకు కూడా ఓటింగ్ హక్కులు కల్పించాలన్న ప్రతిపాదన గురువారంనాటి సమావేశంలో చర్చకు వచ్చింది. రతన్టాటా దగ్గర 10.5 లక్షల ప్రిఫరెన్షియల్ షేర్లున్నాయి. టాటా మాజీ ఉద్యోగులతో సహా మరో పది మంది దగ్గర కూడా ఈ రకం షేర్లు ఉన్నాయి.
ఎవరికి ఎంతెంత వాటా..?
టాటా సన్స్లో టాటా ట్రస్ట్లకు 66 శాతం వాటా ఉంది. మిస్త్రీ కుటుంబానికి చెందిన సంస్థలకు 18.4 శాతం వాటా ఉంది. మరికొంత వాటా గ్రూప్ కంపెనీల చేతుల్లో మరికొందరు వ్యక్తులు, టాటా కుటుంబ సభ్యుల చేతుల్లో ఉంది.
వాటాలు అలా మిస్త్రీలకు...
వాస్తవానికి టాటా సన్స్లో బయటవారెవ్వరికీ వాటాలు ఉండే అవకాశం లేదు. మొత్తం టాటాల కుటుంబం చేతుల్లోనే వాటాలు ఉండాలి. అయితే 1930లో సంస్థ బాధ్యతలను జెఆర్డి టాటాకు అప్పగించినప్పుడు ఆయన సోదరుడు దోరబ్ టాటా అలిగి, ఆ కోపంలో తన వాటాలను మిస్త్రీల కుటుంబానికి విక్రయించారు.
వాటాలు మారవు.. ఎవరివి వారికే...
ప్రస్తుతం మిస్త్రీల కుటుంబం చేతుల్లో ఉన్న వాటాలు షాపూర్ మిస్త్రీ, సైరస్ మిస్త్రీ దగ్గర సమానంగా ఉన్నాయి. పబ్లిక్ లిమిటెడ్ నుంచి ప్రైవేట్ లిమిటెడ్కు మారినప్పటికీ వాటాదారుల్లో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో ఉన్నట్టుగానే షేర్ హోల్డింగ్ ఉంటుంది. మిస్త్రీలు తమ వాటాలను అమ్మేయాల్సి ఉంటుందంటూ వస్తున్న వార్తలను నిపుణులు తోసిపుచ్చారు.