పెద్ద నోట్ల రద్దు అప్పుడు: జ్యూవెలర్స్ కు ఐటీ షాక్ ఇప్పుడు..ట్విస్ట్ ఏంటంటే!!
భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగి మూడేళ్ళకు పైగా అయ్యింది. ఇక ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ జ్యూవెలర్స్ షాపులపై పడింది. అప్పట్లో మోదీ ప్రభుత్వం 2016 నవంబరు 8న పెద్ద నోట్లపై నిషేధం విధించిన తరువాత బంగారం కొనుగోళ్ళపై చాలా మంది ఆసక్తి చూపారు. ఇక జ్యూవెలర్స్ షాపుల యజమానులు బంగారం విక్రయాలతో డబ్బులు కుప్పలు పోసుకున్నారు. అప్పుడు కస్టమర్లకు భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు విక్రయించిన 12 మందికి పైగా ప్రముఖ జ్యూవెలర్స్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.
15,000 మంది జ్యూవెలర్లకు ట్యాక్స్ నోటీసులు
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా డీమానిటైజేషన్ జరిగి ఇన్నేళ్ళు అయిన తర్వాత జ్యూవెలర్స్ కు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వటంతో జ్యూవెలర్స్ కు షాక్ కొట్టినట్టు అయ్యింది. దేశవ్యాప్తంగా 15,000 మంది జ్యూవెలర్లకు ట్యాక్స్ నోటీసులను జారీ చేశారని ఇండియన్ బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే..
ఆ సమయంలో సంపాదించింది మొత్తం చెల్లించాలని నోటీసులు
నల్లధనంతోనే ప్రజలు బంగారం కొన్నారని, అందుకే పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆర్జించిన ఆదాయం మొత్తం తిరిగి చెల్లించాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు ఐటీ అధికారులు .
ఈ నేపధ్యంలో అప్పటి కొనుగోళ్ళపై జ్యూవెలరీ రంగానికి చెందిన వారి నుంచి పన్ను వసూలు చెయ్యాలని భావిస్తున్న అధికారులు రూ 50,000 కోట్లు వసూలు చేయాలని అంచనా వేస్తున్నారని ఇండియన్ బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ పేర్కొంది.
ఆందోళనలో జ్యూవెలరీ షాపుల యజమానులు
ఇక దీనిపై కోర్టులో అప్పీల్కు వెళ్లదల్చుకునే వారు 20 శాతం డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుందని, ఇక కేసు ఓడిపోతే మిగిలిన మొత్తం చెల్లించాల్సి వస్తుందని జ్యూవెలర్స్ పరిశ్రమ ఆందోళనలో ఉంది . ఈ విధమైన పరిస్థితి రావడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జ్యూవెలర్లు రుణాలు చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .ఇక తాజాగా ఐటీ శాఖ నోటీసులతో లబోదిబోమంటున్నారు .
మొత్తం రాబడిని పన్నుగా డిమాండ్ చేయడం మాత్రం అసాధారణం
ఇక పెద్ద నోట్ల రద్దు సమయంలో జ్యూవెలర్స్ సంపాదించిన ఆదాయంపై పన్ను వసూలు చెయ్యటం తప్పు కాదని, కానీ మొత్తం రాబడిని పన్నుగా డిమాండ్ చేయడం మాత్రం అసాధారణమని బులియన్ వర్గాలతో పాటు పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల కనిష్టస్ధాయిలో ఇబ్బందులకు గురవుతుండటంతో పన్ను లక్ష్యాన్ని అధిగమించేందుకు జ్యూవెలర్లకు భారత సర్కార్ షాక్ ఇస్తుందని వారు వాపోతున్నారు. ఈ ఏడాది పెద్దసంఖ్యలో జ్యూవెలర్లకు టాక్స్ డిమాండ్ నోటీసులు పంపారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.