గదిలో రహస్య లేఖ: శశికళ మెడకు మరో ఉచ్చు?
చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కటకటాలు లెక్కిస్తున్న శశికళ మెడకు మరో ఉచ్చు బిగిసే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించిన గుట్కా కుంభకోణం కూడా ఆమెను వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి.
పోయెస్ గార్డెన్లోని శశికళ గది నుంచి రహస్యమైన లేఖను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయం పన్ను శాఖ అధికారులు మద్రాసు హైకోర్టుకు చెప్పారు. గుట్కా కుంభకోణంలో పాలు పంచుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాసిన రహస్యమైన లేఖగా దాన్ని ఆదాయం పన్ను శాఖ అధికారులు చెప్పారు.
గుట్కా కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ డిఎంకె శాసనసభ్యుడు జె అంబజగన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం నేపథ్యంలో చెన్నై ఆదాయం పన్ను శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ సుసీబాబు దాఖలు చేసిన అఫిడవిట్లో ఆ సమాచారాన్ని పొందుపరిచారు
నిషేదిత గుట్కాను విక్రయించడానికి వెసులుబాటు కల్పించడానికి జరిగిన వ్యవహారంలో రాష్ట్ర మంత్రికి, ఉన్నత స్థాయి కేంద్ర, రాష్ట్ర అధికారులు, పోలీసు అధికారులకు పాత్ర ఉందని పిల్లో ఆరోపిస్తూ సిబిఐ విచారణ అయితేనే సరైన దర్యాప్తు జరుగుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
గుట్కా కుంభకోణానికి సంబంధించి అప్పటి ఐటి శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ 2016 ఆగస్టు 11వ తేదీన తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పోలీసు డైరెక్టర్ జనరరల్కు రాసిన లేఖగా అఫిడవిట్లో చెప్పారు.