బీజేపీని ఇరుకున పెట్టిన సుబ్రహ్మణ్యన్ స్వామి..ఆర్థిక వ్యవస్థపై కీలక కామెంట్స్
దేశ ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలైందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించిన స్వామి... పెట్టుబడిదారులను ప్రోత్సహించాలంటే ముందుగా ట్యాక్స్ టెరరిజంను అంతమొందించాలని అభిప్రాయపడ్డారు. ఇక దేశంలోని ప్రతి యూనివర్శిటీలో పోలీసు సిబ్బంది ఉండాలన్న ఆయన... జవహర్లాల్ నెహ్రూ యనివర్శిటీలో చోటుచేసుకున్న హింసాత్మక వాతావరణం దృష్ట్యా క్యాంపస్ను రెండేళ్ల పాటు మూసివేయాలనే వ్యాఖ్యలు చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచుల్లో ఉందని చెప్పిన సుబ్రహ్మణ్యన్ స్వామి... ఇది ఇలానే కొనసాగితే బ్యాంకులు మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని జోస్యం చెప్పారు. వీటితో పాటు ఎన్బీఎఫ్సీలు కూడా మూతపడి అత్యంత దారుణ పరిస్థితి దేశంలో నెలకొనే అవకాశం ఉందన్నారు. ఇండస్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలంటూ కొన్ని మంత్రాలను తప్పక పాటించాల్సిందే అని చెప్పుకొచ్చిన స్వామి... ముందుగా ఇన్కం ట్యాక్స్ను రద్దు చేయాలని సూచించారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో పన్ను భయం వీడుతుందని అదే సమయంలో పెట్టుబడులు పెరుగుతాయని చెప్పారు. మన దేశంలో మంచి సప్లయ్ ఉన్నప్పటికీ డిమాండ్ కొరత స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
డిమాండ్ పెరగాలంటే ప్రభుత్వం కరెన్సీ నోట్లను ముద్రించి ప్రజల చేతుల్లో పెట్టాలని సూచించారు. ప్రభుత్వం రహదారులను నిర్మించాలని, అవి ఆరు లేన్లు, ఎనిమిది లేన్లు ఉండాలన్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ గురించి మాట్లాడిన స్వామి... విద్యార్థులకు క్యాంపస్లు సురక్షితంగా ఉండాలని చెప్పారు. అమెరికా యూనివర్శిటీల్లో పోలీస్ సిబ్బంది ఎలాగైతే ఉంటారో మన దేశంలోని విశ్వవిద్యాలయాల్లో కూడా పోలీసు సిబ్బంది ఉండి తీరాలన్నారు.
జేఎన్యూలాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీల్లో ఒక్క పోలీసులే కాదు.. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. జేఎన్యూను రెండేళ్ల పాటు మూసివేయాలని చెప్పిన సుబ్రహ్మణ్యన్ స్వామి అక్కడి విద్యార్థులను ఇతర యూనివర్శిటీలకు తరలించే ఏర్పాటు చేయాలని అన్నారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సుబ్రహ్యణ్యన్ స్వామి మరోసారి తన కామెంట్స్తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేశారని అనలిస్టులు చెబుతున్నారు.