టాక్సీ డ్రైవర్ ఘాతుకం: లేడీ ప్యాసెంజర్ను నిర్బంధించి, అత్యాచార యత్నం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో టాక్సీ డ్రైవర్ మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మధు విహార్ ప్రాంతంలోని తన ఇంటికి వెళ్లేందుకు టాక్సీని ఆశ్రయించిన మహిళ(39)పై ఆ టాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 10.30గంటల సమయంలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు రాజౌరి ప్రాంతంలో బాధిత మహిళ లోకల్ టాక్సీని ఆశ్రయించింది. ఆమె టాక్సీ ఎక్కేటప్పటికే టాక్సీ ముందు సీటులో ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. దీంతో ఆమె అభ్యంతరం తెలిపింది. అతను ద్వారకా దగ్గర దిగిపోతాడని ఆమెకు డ్రైవర్ చెప్పాడు.
కాగా, ద్వారకా క్రాసింగ్ వద్ద టాక్సీని ఆపిన డ్రైవర్ సిఎన్జీ ట్యాంకు తనిఖీ పేరుతో ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమె శరీరా భాగాలను తాకడం ప్రారంభించాడు. కేకలు వేసేందుకు ప్రయత్నించిన మహిళ నోటిని డ్రైవర్ మూసేశాడు. ఆ తర్వాత లైంగిక దాడికి యత్నించాడు. డ్రైవర్ బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె మళ్లీ గట్టిగా కేకలు వేసింది.
ఆమె అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను పట్టుకున్నారు. ఆ తర్వాత అటుగా వచ్చిన పోలీసులకు నిందితుడ్ని అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. డ్రైవర్ తోపాటు ఉన్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.