బులంద్షహర్ హింసలో పోలీసు అధికారిని చంపింది ఈ ట్యాక్సీ డ్రైవరే: పోలీసులు
ఉత్తర్ ప్రదేశ్ బులంద్షెహర్ అల్లర్ల కేసులో పోలీస్ అధికారి సుబోధ్ కుమార్ సింగ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ను కాల్చి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 3న గోవధ జరిగిందంటూ ఓ వర్గం వారు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో హింస చెలరేగడంతో అదుపు చేసేందుకు పోలీస్ అధికారి సుబోధ్ కుమార్ సింగ్ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆయన్ను కాల్చి చంపాడు. ప్రస్తుతం ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ప్రశాంత్ నాథ్ అనే ట్యాక్సీ డ్రైవర్గా గుర్తించారు. రాజకీయ ఒత్తిళ్లవల్లే పోలీసులు అసలు నిందితులను అరెస్టు చేయడం లేదని సుబోధ్ కుమార్ సింగ్ కుటుంబ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో ఈ అరెస్టు జరగడం విశేషం.
అంతకుముందు ఘటనతో సంబంధం ఉందని 27 మంది పేర్లను పోలీసులు బయటపెట్టగా అందులో ఆరుగురిని మాత్రమే అరెస్టు చేయడం జరిగింది. తాజాగా ప్రశాంత్ నాథ్ను అరెస్టు చేసిన పోలీసులు... సుబోధ్ కుమార్ సింగ్ను తానే చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని చెప్పారు. ఇప్పటి వరకు వీడియో ఫుటేజీల ఆదారంగా 19 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఘటనకు సంబంధించి ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో విచారణ చేసిన సిట్ నోడియా దగ్గర ప్రశాంత్ను అదుపులోకి తీసుకుంది. అయితే ప్రశాంత్ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకోవడంలో విఫలం అయ్యారు పోలీసులు.
ఇక ఈ ఘటనకు సంబంధించి భజ్రంగ్ధళ్ యోగేష్ రాజ్ ,బీజేపీ నేత శిఖర్ అగర్వాల్, ఉప్పేంద్ర రాఘవ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్త ఇంకా పరారీలో ఉన్నారు. ఇక మరో 23 మంది ఫోటోలతో కూడిన పోస్టరును కూడా పోలీసులు డిసెంబర్ 14 విడుదల చేశారు. ఘటనలో మరో స్థానికుడు సుమిత్ మృతి తర్వాత తనను ఆందోళనకారులు కార్నర్ చేశారని దీంతో సుబోధ్ కుమార్ సింగ్ను తాను పట్టుకుని అతని తుపాకీతోనే కాల్చి చంపినట్లు ప్రశాంత్ విచారణలో ఒప్పుకున్నాడని బులంద్ షెహర్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శివరామ్ యాదవ్ తెలిపారు . ఇదిలా ఉంటే ప్రశాంత్ చిన్న చిన్న కేసులలో నిందితుడిగా ఉన్నాడని అయితే ఈ ఘటన జరిగిన తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాన్ని విడిచి పారిపోయాడని యాదవ్ తెలిపారు. అయితే సీసీ ఫుటేజీలు, ఎలక్ట్రానిక్ సర్వేలియన్స్, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ ద్వారా ప్రశాంత్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.