కరోనా : ఆశలు రేకెత్తిస్తున్న టీబీ వ్యాక్సిన్... క్లినికల్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
కరోనా వ్యాక్సిన్ చికిత్సలో టీబీ వ్యాక్సిన్ ఆశాజనకంగా కనిపిస్తోంది. జర్మనీలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో మెరుగైన ఫలితాలను కనబరుస్తోంది. VPM1002గా పరిగణించే ఈ క్షయ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని పెంచి కరోనాను ఎదుర్కోవడంలో తోడ్పడుతుందని నిపుణులు చెప్తున్నారు.
కరోనా చికిత్స కోసం ఈ వ్యాక్సిన్ను అభివృద్ది చేస్తున్న బెర్లిన్కి చెందిన మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షన్ బయోలజీ,వాక్జిన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్(VPM)తో భారత్కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకోవడం భారత్కు కలిసొచ్చే అంశం. ఈ ఒప్పందం కారణంగా... ఒకవేళ క్లినికల్ ట్రయల్స్ పూర్తిగా విజయవంతమైతే వ్యాక్సిన్ మొదటగా జర్మనీతో పాటు భారత్కు కూడా వస్తుంది. భారత్లోనూ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన అనుమతులు పొందేందుకు ఎంపిక చేయబడింది.
వీపీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ లియాండర్ గ్రోడ్ దీనిపై మాట్లాడుతూ...ప్రస్తుతం ఈ వ్యాక్సిన్కు సంబంధించి రెండు ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సంయుక్తంగా ఈ ట్రయల్స్ చేపడుతున్నట్లు తెలిపారు. కరోనా రిస్క్ ఎక్కువగా ఉండే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్,వృద్దులపై ఈ రెండు ట్రయల్స్ చేస్తున్నట్లు చెప్పారు. జర్మన్ నేషనల్ అథారిటీ ఇప్పటికే వీటికి ఆమోదం తెలిపిందన్నారు.
Recommended Video
ప్రస్తుతం బెర్లిన్,హాంబర్గ్,ఎర్ఫర్ట్,హానోవర్,మ్యూనిచ్ నగరాల్లో జరుగుతున్న టీకా ప్రయోగాల కోసం ఎంతోమందిని రిక్రూట్ చేసుకుంటున్నారు. త్వరలోనే మరికొన్ని పట్టణాల్లో టీకా ప్రయోగాలు చేపట్టనున్నారు. ఫేజ్-3 దశలో 1200 మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్,2200 మంది సీనియర్ సిటిజెన్స్పై ట్రయల్స్ జరపనున్నారు.