దూసుకెళ్తున్న టీసీఎస్: టాప్-3 ప్రపంచ ఐటీ బ్రాండ్స్లో చోటు
భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మరో ఘనత సాధించింది. ప్రపంచ ఐటీ రంగంలో అతి విలువైన తొలి మూడు బ్రాండులలో ఒకటిగా నిలిచింది.
లండన్: భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మరో ఘనత సాధించింది. ప్రపంచ ఐటీ రంగంలో అతి విలువైన తొలి మూడు బ్రాండులలో ఒకటిగా నిలిచింది. అయిదేళ్ల కిందట తొలి నాలుగు బ్రాండుల్లో ఒకటిగా నిలిచిన సంస్థ తాజాగా మరో స్థానం ఎగబాకడం విశేషం. తొలి రెండు స్థానాల్లో ఐబీఎం, యాక్సెంచర్ ఉన్నాయి.
టాప్-3లో..
అంతర్జాతీయ బ్రాండు సేవల సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ఈ విషయాలను వెల్లడిచింది. టీసీఎస్ నాణ్యమైన పనితీరుతో ఐబీఎం, యాక్సెంచర్ వంటి సంస్థల సరసన నిలిచిందని బ్రాండ్ ఫైనాన్స్ ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) డేవిడ్ హేగ్ వెల్లడించారు.
బిలియన్ డాలర్స్ మార్క్..
ప్రస్తుతం కంపెనీ మంచి ప్రదర్శనతో ముందుకు సాగుతోందని చెప్పారు. రాబోయే ఏడేళ్లలో వార్షిక సగటు దాదాపు బిలియన్ డాలర్స్కు చేరుకుంటోందని తెలిపారు. టీసీఎస్కు మొన్నటి వరకు సీఈఓగా ఎన్ చంద్రశేఖరన్... తాజాగా టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీసీఎస్కు ఆర్ గోపీనాథన్ నియమితులయ్యారు.
యూరోప్, అమెరికాల్లో..
టాటా ఇండస్ట్రీలో టీసీఎస్ అత్యధిక బ్రాండ్ స్ట్రెన్త్తో AA+ సాధించింది. అంతేగాక, టాటా బ్రాండ్ విలువలో 69శాతం టీసీఎస్ వాటా ఉండటం విశేషం. యూరోప్, అమెరికాలోని సుమారు 100 బ్రాండ్లకు రన్నింగ్ ప్రొగ్రామ్స్ను అందిస్తోంది టీసీఎస్.
మరింత పెంచుతాం..
కాగా, కంపెనీ ఉద్యోగులే తమ బలమని టీసీఎస్ సీఈఓ గోపీనాథన్ చెప్పారు. అంతేగాక, వినియోగదారులకు అభిరుచికి తగినట్లు వినూత్న ప్రొగ్రామ్స్ అందిస్తోందని తెలిపారు. బ్రాండ్ విలువను మరింత పెంచేందుకు తామంతా కృషి చేస్తామని గోపీనాథన్ చెప్పారు.