ఎలక్టోరల్ ట్రస్ట్ కు టీసీఎస్ ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా .. అక్షరాలా 220 కోట్లు
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఎన్నడూ లేని విధంగా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి గాను రూ. 220 కోట్ల భారీ మొత్తాన్ని ఎలక్టోరల్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చింది. ఈ విరాళం మొత్తాన్ని కంపెనీ ఇతర వ్యయాల్లో చూపించింది. ఇప్పటి వరకు ఎలక్టోరల్ ఫండ్ కేటాయింపుల్లో కంపెనీకి ఇదే అత్యధికమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఈ విరాళాన్ని ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారో వెల్లడి కాలేదు.
దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయా రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు అందిస్తాయి. కార్పొరేట్ సంస్థలు, రాజకీయ పార్టీలకు అనుసంధానంగా ఉండే ఎలక్టోరల్ ట్రస్ట్లు చాలా ఉన్నాయి.ఇందులో అతి పెద్దది భారతీ గ్రూపు, డీఎల్ఎఫ్ సంస్థలతో ఏర్పాటైన ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ 2017-18లో రూ. 144 కోట్లు ( మొత్తం రూ. 169 కోట్ల విరాళాల్లో) బీజేపీకి విరాళంగా ఇచ్చింది.
ఇక ఇదే విధంగా 2013లో టాటా ట్రస్ట్ ఏర్పాటు చేసిన ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్కు 2013-16 మధ్య రూ. 1.5 కోట్లను టీసీఎస్ విరాళంగా అందజేసింది. ఈ విరాళాన్ని అందుకున్న పార్టీల్లో కాంగ్రెస్, బిజూ జనతాదళ్లు మొదటి వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం ఇచ్చిన విరాళం ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారో ఇంకా వెల్లడించలేదు .