టీసీఎస్ టెక్కీ ఆత్మహత్య, ప్రేయసి హ్యాండ్ ఇచ్చి వేరే వ్యక్తితో !
ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని జీవితంపై విరక్తి పెంచుకున్న పూణేలోని టీసీఎస్ కంపెనీ సాఫ్ట్ వేర్ ఇంజనీరు అభిషేక్ కుమార్ (23) తను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్.
పూణే: జీవితంపై విరక్తి పెంచుకున్న టీసీఎస్ కంపెనీ సాఫ్ట్ వేర్ ఇంజనీరు తను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పూణే నగరంలో జరిగింది. కాన్పూర్ కు చెందిన అభిషేక్ కుమార్ (23) అనే యువకుడు ప్రేమించిన యువతి దూరం అయ్యిందని ఆత్మహత్య చేసుకున్నాడు.
పూణేలోని రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్ లోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న అభిషేక్ కుమార్ స్నేహితులతో కలిసి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. గత నెల రోజుల నుంచి ఇతను జీవితంపై విరక్తి పెంచుకున్నాడు.
స్నేహితులతో కూడా సరిగా మాట్లాడకుండా ఒంటరిగా ఉండేవాడని సమాచారం. స్నేహితుడితో కలిసి అపార్ట్ మెంట్ లో టీవీ చూస్తున్న సమయంలో ఎవరో ఫోన్ చెయ్యడంతో వారితో అభిషేక్ మాట్లాడాడు. తరువాత తనకు నిద్ర వస్తుందని స్నేహితుడికి చెప్పి బెడ్ రూంలోకి వెళ్లిపోయాడు.
అనంతరం గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. అతని స్నేహితుడు అభిషేక్ ను వెళ్లి పిలిచాడు. అభిషేక్ నుంచి స్పందనలేకపోవడంతో కిటికీ పగలగొట్టి ఫ్యాన్ కు వేలాడుతున్న అభిషేక్ ను కిందకుదించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అభిషేక్ మరణించాడని వైద్యులు చెప్పారు.
అభిషేక్ ఓ అమ్మాయిని ప్రేమించాడని అతడి స్నేహితులు పొలీసులకు చెప్పారు. ఆ అమ్మాయి అభిషేక్ ను మోసం చేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని, అప్పటి నుంచి జీవితంపై విరక్తి పెంచుకున్న అభిషేక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితులు చెప్పారని పోలీసులు అన్నారు.
అభిషేక్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. గత వారం పూణేలోని ఇన్ఫోసిస్ లో పని చేస్తున్న లేడీ టెక్కీ రసిలా రాజు (24) ఆమె పని చేస్తున్న కార్యాలయంలోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. గత డిసెంబర్ నెలలో పూణేలో తను పని చేస్తున్న కార్యాలయంలోనే టెక్కీ ఆత్మహత్య చేసుకున్నారు.