ఇక ఏపిలో టీడిపీ కి గడ్డు కాలమే..! ఏపీ ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారన్న మాజీ సీఎం శివరాజ్ సింగ్ !!
గుంటూరు/హైదరాబాద్ : ఆంధ్రలో ఇక తెలుగుదేశం పార్టీ ఉండదని, కనుమరుగు అవుతుందని బీజేపి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఏపీ లో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది, టీడీపీ కూడా ఖాళీ అయ్యేందుకు సిద్దంగా ఉందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రాహుల్ గాంధీ పార్టీ ని నడపలేక వదిలేశారు, అధ్యక్ష పదవి నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. కెప్టెన్ అనే వాడు ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుండి నడపాలి అన్నారు. రాహుల్ గాంధీ దారిలోనే ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల అధ్యక్షులు వదిలేశారని చౌహాన్ అన్నారు.
ఏపిలో పర్యటిస్తున్న బీజేపి నేతలు..! బలోపేతం దిశగా ఫోకస్..!!
ఏపీ పర్యటనకు వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 2019 పార్లమెంటు ఎలక్షన్ లో బిజెపి మహా విజయం సాధించిందని, 303సీట్లు బీజేపీ, ఎన్డీఏ తో కలిపి 353 సీట్లు సాధించామన్నారు. జీరో స్థాయి నుంచి అనేక రాష్ట్రాలలో బీజేపీ అధికారికం లోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్డీ చరిత్ర దేశంలో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ నకిలీ గాంధీలతో నిండిపోయింది. అందుకే ప్రజలు అన్ని రాష్ట్రాలలో ఓడిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు కోలుకోలేని దెబ్బ తిన్నాడు. ఏపీ లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో.. టీడీపీ పరిస్థితి అలానే ఉండబోతుంది.
ఇక టీడిపి పని ఐపోయింది..! బీజేపి పుంజుకుంటుందంటున్న కమలం నేతలు..!!
మోది ని తిట్టడమే తప్ప తాను చేసిన అభివృద్ధి ఏమిటో చంద్రబాబు చెప్పలేకపోయారు. ఏపీ లో కూడా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి, వారసత్వ రాజకీయాలు మేము ప్రోత్సహించం. మోది నేతృత్వంలో పేదలు, రైతులు, మహిళలు ఆనందంగా ఉన్నారు. దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తూ మోది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారారు. ఏపీ లో 25లక్షల సభ్యత్వం నమోదు మా లక్ష్యం. సభ్యత్వ నమోదు కార్యక్రమం తో పాటు మొక్కల నాటే కార్యక్రమం మోడి శ్రీకారం చుట్టారు. 2025 నాటికి ఎపి లో అధికారం చేపడతాం. విపక్షాలు చెప్పిన విధంగా మోది పాలన సరిగా లేకుంటే.. రెండో సారి ఎలా గెలిపిస్తారు. బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిసే ఉంటాయి.. ఎవరైనా రావచ్చు. పార్టీ కి సేవ చేయాలనుకునే వారికి బీజేపీ పెద్ద పీట వేస్తుందన్నారు.
దేశవ్యప్తంగా బీజేపి ప్రభావం..! ఇక దక్షిణ భారతం వైపు బీజేపి చూపు అంటున్న నేతలు..!!
బీజేపి కార్యకర్తల పార్టీ, 8 లక్షల బూత్ కమిటీలు కలిగిన ఏకైక పార్టీ బీజేపి. దేశం వర్తమానం బీజేపి.. భవిష్యత్ బీజేపి నే. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ విజయయాత్ర మనలో ప్రభోదాన్ని నింపాలి. అధికారం పరమావధి కాదు. అధికారం దేశం కోసం.. అధికారం ప్రజల కోసమే అనేది బీజేపి భావన. సబ్ కా వికాస్.. బీజేపి మూలసూత్రం. బీజేపి పార్టీ కాదు.. ఓ సంస్కృతి.. భారతీయుల జీవన విధానం. పార్టీలో కులాలు, గ్రూపు రాజకీయాలు ఉండవు. మనం కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తామని చెప్పడం లేదు, రాహుల్ గాంధీ ఆ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నూతన రాజకీయ సంస్కృతి తీసుకురావడమే లక్ష్యం. కొత్త పరిపాలన వ్యవస్థను తీసుకురావడం కోసం పనిచేస్తామన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్.
వచ్చే ఎన్నికల్లో అదికారం మాదే..! మోదీ మార్క్ చూపిస్తామన్న చౌహాన్..!!
సామాన్యులు ఈ సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్నారు. మోదీ నూతన విధానాల పట్ల ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. ఏపీలో అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ సానుకూల పరిణామాలను పార్టీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలి. ఏపీలో బీజేపికి నిరుత్సాహకరమైన ఫలితాలు వచ్చాయి. ఈ ఓటమిని ఛాలెంజ్ గా తీసుకోవాలి. రాష్ట్రంలో పార్టీని తెలంగాణలో మాదిరిగా బలోపేతం చేయాలి. టీడిపి పట్ల ప్రజల్లో భ్రమలు తొలిగిపోయాయి. ఇక తానా సభలోనే టీడిపి మిగిలే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ పాలనలో వందల కోట్ల అవినీతి జరిగింది. రాష్ర్టంలో బలమైన శక్తిగా బీజేపి ఎదగాలి. 2024 నాటికి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలి. ఏపీ అభివృద్ధికి బీజేపి కట్టుబడి ఉంది. మోదీ ప్రభుత్వం వచ్చే 5ఏళ్లలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోంది. ప్రజలు మళ్లీ పొయ్యిలో పడే అవకాశం ఇవ్వం అన్నారు.