'ఎంగిలి టీ కప్పులు పెట్టాల్సిన చేతిలో దేశాన్ని పెట్టాం': చంద్రబాబు దీక్షలో సరికొత్త వివాదం
అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ దీక్షలో ఓ వివాదాస్పద పోస్టర్ లేదా ప్లకార్డును టీడీపీ ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడం కోసం ఏకంగా ఛాయ్ అమ్ముకునేవాడి చేతికి పగ్గాలు ఇవ్వవద్దనే అభిప్రాయం వ్యక్తం చేయడం, తద్వారా ఏదైనా పని చేసుకొని బతికే వారిని అవమానించేలా మాట్లాడటం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీపై వరుసగా విమర్శలు
విషయానికి వస్తే, చంద్రబాబు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల పాటు దీక్షకు కూర్చున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ రాత్రి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. కానీ, అంతకుముందు రోజు ప్రధానిపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలకు దిగడం, దీక్ష సమయంలో వివాదాస్పద ప్లకార్డు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఛాయ్ అమ్ముకునే వాడికి దేశాన్ని అప్పగించాం
దీక్షలో ఏర్పాటు చేసిన పోస్టర్లో మోడీ చాయ్ అమ్మిన విషయాన్ని గుర్తు చేశారు. అంతవరకు ఒకే. కానీ... కడగాల్సిన టీ కప్పులను ఇవ్వాల్సినోడికి దేశాన్ని అప్పగించారని అందులో పేర్కొన్నారు. ఇది ప్రధాని మోడీకి లేదా టీ అమ్ముకునే వారిని మాత్రమే అవమానించినట్లు కాదని, అలా వృత్తిరీత్యా ఎవరు ఏ పని చేసుకున్నా.. వారు ఉన్నతస్థాయికి అనర్హులుఅనేలా అందరినీ అవమానించేలా ఇది ఉందని విమర్శలు వస్తున్నాయి.
టీడీపీ పశ్చాత్తాపం
ఈ ప్లకార్డు తీవ్ర దుమారానికి దారి తీస్తోంది. అంటే ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో అలాగే ఉండాలా జీవితంలో ఎదగాల్సిన అవసరం లేదా అని వ్యాఖ్యానిస్తున్నారు. చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారిని ఇది అవమానించినట్లేనని, తక్కువ చేసి చూడడం ఏమిటని అంటున్నారు. అయితే, ఆ ప్లకార్డుతో తమకు సంబంధం లేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారట. అయితే దానిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తమకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఆ తర్వాత, విమర్శల తీవ్రత నేపథ్యంలో టీడీపీ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. దీంతో ఈ దుమారానికి ఫుల్స్టాప్ పడినట్లే భావించవచ్చు.