ఈ టీడీపీ ఎంపీ మంచి నటుడు... సభలో నవ్వులు పూయించిన ప్రధాని మోడీ
ఢిల్లీ: 16వ లోక్సభ సమావేశాలు చివరిరోజున ప్రధాని ప్రసంగించారు. తనదైన శైలిలో ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ లక్ష్యంగా మాట్లాడారు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో జరుగుతున్న మహాకూటమికి సంబంధిచిన అంశాలను కూడా చాలా నిశితంగా పరిశీలించిన ప్రధాని మహాకూటమి పై కూడా మాట్లాడారు. ఇక టీడీపీ ఎంపీ గురించి ప్రధాని చెప్పి సభలో నవ్వులు పూయించారు. ఇంతకీ ప్రధాని మోడీ చెప్పిన ఎంపీ ఎవరు..? ఆయన పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది..?
విచిత్ర వేషధారణలో టీడీపీ ఎంపీ శివప్రసాద్
ఇదిగో... ఈ ఎంపీని గుర్తు పట్టారా..? మారువేషంలో ఉంటే గుర్తుపట్టకపోయి ఉండొచ్చేమో... ఈయనే మన చిత్తూరు ఎంపీ శివప్రసాద్. చిత్తూరు నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన ఎప్పుడూ తన విచిత్ర వేషధారణతో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా ఆయన పార్లమెంటు ప్రాంగణంలో వేసే వేషధారణను అక్కడి మీడియా వారు ఎక్కువ కవరేజీ ఇస్తూ ఉంటారు. అంతేకాదు ఆయన్ను తన సహచర ఎంపీలు చూసి కాసేపు ఆయన చెప్పే డైలాగులు విని మరీ సభలోకి వెళతారు. ఎన్ని వేషధారణలు వేసిన...ఎన్ని పేలిపోయే డైలాగ్స్ పేల్చినా ఆయన డిమాండును మాత్రం కేంద్రం పట్టించుకోలేదు.
ప్రత్యేక హోదా కోరుతూ విచిత్ర వేషధారణలో శివప్రసాద్
తెలుగుదేశం పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్డీఏ నుంచి వైదొలిగిన తర్వాత జరిగిన ప్రతి పార్లమెంటు సమావేశాల్లోను టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రత్యేకంగా వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ పలువురు ప్రముఖుల వేషధారణతో డైలాగులు చెబుతూ ఎంపీ శివప్రసాద్ పార్లమెంటు ప్రాంగణంలో హైలైట్గా నిలిచారు. ఓ సారి అల్లూరి సీతారామరాజులా కనిపిస్తే మరోసారి ట్రాన్స్జెండర్ వేషం వేశారు. మరోసారి హరిదాసులా కనిపిస్తే మరోమారు స్వామి వివేకానంద గెటప్లో కనిపించారు. ఓ సారి శ్రీకృష్ణుడిలా కనిపిస్తే మరోసారి నియంత హిట్లర్లా దర్శనమిచ్చారు. ఎన్ని వేషాలు వేసినా అతని డిమాండ్ మాత్రం ఒక్కటే... ఏపీకి ప్రత్యేక హోదా విభజన బిల్లులోని హామీలను నెరవేర్చడం. ఎంపీ శివప్రసాద్కు మద్దతుగా అప్పుడప్పుడు మరో సినీనటుడు ఎంపీ మురళీమోహన్ కూడా నిలిచారు.
శివప్రసాద్ను చూస్తే చాలు టెన్షన్స్ మాయమవుతాయి: మోడీ
ఇక అసలు విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోడీ.... 16వలోక్సభ చివరి సమావేశాల సందర్భంగా సభలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ పేరును ప్రస్తావించారు. ఎంపీ శివప్రసాద్ మంచి నటుడని ప్రధాని మోడీ కితాబిచ్చారు. పార్లమెంటుకు విభిన్న రూపాల్లో వివిధ వేషధారణలో వచ్చి అందరినీ నవ్వించేవారన్నారు. తాను సభకు ఎన్ని టెన్షన్లతో వచ్చినా... శివప్రసాదు వేషధారణ చూడగానే అన్నీ మరిచిపోతానని సెటైర్లు విసిరారు మోడీ. మోడీ ఈ మాటలు చెప్పగానే సభలో నవ్వులు పూశాయి. తను మంచి ఎంటర్టెయినర్ అని చెప్పిన ప్రధాని మోడీ... సభకు హాజరయ్యేముందు ఆయన నాటకాలను చూసిన సభ్యులకు అన్ని టెన్షన్లు పోతాయన్నారు. ఆ నాటకాలను చూసి ఎంచక్కా సభకు హాజరవుతున్నారని చెప్పారు ప్రధాని మోడీ. టెన్షన్లతో సభకు వచ్చే వారిని అతని నాటకాలతో తనవైపు అటెన్షన్తో తిరుగుతారని ప్రధాని మోడీ చెప్పారు.