బీజేపీలో పార్టీ ఎంపీల చేరికపై టీడీపీ గుస్సా.. రాజ్యసభ ఛైర్మన్కు కంప్లైంట్
ఢిల్లీ : టీడీపీ వర్సెస్ బీజేపీ వార్ మరింత ముదిరింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో దూరం పెంచుకున్న టీడీపీ.. లోక్సభ ఎన్నికల వేళ కూడా అంటీముట్టనట్లు వ్యవహరించింది. అయితే తాజాగా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం ఆ పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది.
టీడీపీ రాజ్యసభ సభ్యులైన వైఎస్ చౌదరి అలియాస్ సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరి టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేయాలని కోరడంతో ఆ మేరకు చకచకా పావులు కదిపారు కమలనాథులు. అయితే వారి చేరికను ఇతర టీడీపీ ఎంపీలు సవాల్ చేస్తున్నారు. అది రాజ్యాంగ విరుద్ధమని న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
ఎంత పని చేసింది బీజేపీ అధిష్టానం.. మా నోరు మూయించిందని బాధపడుతున్న రాష్ట్ర నేతలు
ఆ క్రమంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిశారు. బీజేపీలో చేరిన ఆ నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలైన గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని తదితరులు వెంకయ్యనాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లోని నాలుగో పేరా ప్రకారం నలుగురు టీడీపీ ఎంపీలపై చర్యలు తీసుకోవాలని జయదేవ్ డిమాండ్ చేశారు.
పొలిటికల్ పార్టీ విలీనం అనేది సంస్థాగత స్థాయిలో జరగాల్సిందే తప్ప లెజిస్లేచర్ స్టేజీలో జరగకూడదని అభిప్రాయపడ్డారు జయదేవ్. పార్టీల పరంగా చూసినట్లయితే టీడీపీ, బీజేపీ మెర్జ్ కాలేదని.. అలాంటి సందర్భంలో ఆ నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనం చేయాలంటూ కోరడం తగదని పేర్కొన్నారు. అందుకే వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళతామని చెప్పుకొచ్చారు.