నరేంద్ర మోడీకి జై కొట్టిన చంద్రబాబు..ప్రశంసల వర్షం..బహిరంగ లేఖ: సోనియా, రాహుల్ గాంధీ బాటలో.. :
న్యూఢిల్లీ: భయానకంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన లక్షా 70 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం సరైన సమయంలో సరైన నిర్ణయం అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ విషయంలో కితాబులను ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చి..అర్ధరాత్రి అడవుల్లో చిక్కుకున్న 14 మంది అమ్మాయిలు: ముఖ్యమంత్రికి ఫోన్కాల్..!
లాక్డౌన్ మినహా..
వచ్చే నెల 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించినట్లు ప్రధానమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు కూడా లాక్డౌన్ను నిర్వహిస్తున్నాయి. ప్రజలు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. గడప దాటి బయటికి అడుగు పెట్టడానికి సాహసించట్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కర్ఫ్యూ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా ఉండటానికే కేంద్రం ఈ లాక్డౌన్ మంత్రాన్ని జపిస్తోంది.
దినసరి వేతన కార్మికుల కోసం..
ఇలాంటి కర్ఫ్యూ తరహా వాతావరణాన్ని ఇన్ని రోజుల పాటు కొనసాగించాల్సి రావడం వల్ల పేదలు, దినసరి వేతన కార్మికులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. రెక్కాడితే గానీ డొక్కాడని శ్రమజీవుల పాలిట ఈ లాక్డౌన్ మరణశాసనంగా తయారైంది. వచ్చేనెల 14వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగించాల్సి వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అప్పటి దాకా రోజువారీ కూలీల ఉపాధి మాటేమిటనే ప్రశ్న తలెత్తింది.
సోనియా, రాహుల్ గాంధీ ప్రశంసలు..
దీనికి చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకంగా లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని స్వయంగా ప్రకటించారు. ఈ ప్యాకేజీ అద్భుతంగా ఉందంటూ ప్రతిపక్షాలు కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్యాకేజీని స్వాగతించారు.
సరైన సమయంలో..సరైన చర్యగా..
తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్యాకేజీ పట్ల తన స్పందనను వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన ప్రధానమంత్రికి బహిరంగ లేఖ రాశారు. లక్షా 70 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడాన్ని చంద్రబాబు సరైన సమయంలో తీసుకున్న సరైన చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి బహిరంగ లేఖ రాశారు.
ఈ ప్యాకేజీ వల్ల 80 కోట్ల మంది ప్రజలకు లబ్ది..
కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ వల్ల దేశవ్యాప్తంగా మూడొంతుల మంది ప్రజలకు లబ్ది కలుగుతుందని చంద్రబాబు అన్నారు. మానవతా హృదయంతో నరేంద్ర మోడీ స్పందించారని ప్రశంసించారు. స్వయం సహాయక బృందాలు, జాతీయ ఉపాధిహామీ పథకం లబ్దిదారులకు ఉపయోగపడుతుందని అన్నారు. సంఘటిత, అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, ఉద్యోగులకు మేలు కలిగించేలా ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారని కితాబిచ్చారు.