టీఎంసీ దౌర్జన్యం: బలవంతంగా టీడీపీ ఆఫీస్ ఆక్రమణ!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెసు పార్టీల మధ్య గదుల కోసం గొడవ రాజుకుంది. టీడీపీ న్యూఢిల్లీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ఆక్రమించారు. టీడీపీ కార్యాలయాన్ని ఆక్రమించిన మరుక్షణం టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించారు.
ఆ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బోర్డులను ఏర్పాటు చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు మండిపడ్డారు. టీఎంసీ ఎంపీలు కాస్త వేచి చూస్తే బాగుండేదని, కార్యాలయంపై పూర్తి స్పష్టత రాకుండా బోర్డులను తొలగించడం తొందరపాటు చర్యని అభిప్రాయపడ్డారు.
టీఎంసీ ఎంపీలకు కేటాయించినట్లుగా భావిస్తున్న గదులను వెకేట్ చేసేందుకు టీడీపీ ఎంపీలు నిరాకరించారని సమాచారం. దీంతో టీఎంసీ ఎంపీలు బలవంతంగా ఆ గదులను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ బోర్డులు తొలగించి, తమ బోర్డులు పెట్టారు. టీడీపీ ఎంపీలు కూడా తిరిగి తమ బోర్డులను ఏర్పాటు చేశారు. గదులు ఖాళీ చేసేందుకు నిరాకరించారు.
టీఎంసీ ఎంపీలు పార్లమెంటు హాలులోని తమ కార్యాలయాలను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని టీడీపీ ఎంపీలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడుకు ఫిర్యాదు చేశారు. తాము ఈ అంశాన్ని లోకసభలో లేవనెత్తుతామని చెప్పారు.
టీడీపీ ఆఫీస్ సెక్రటరీ సత్యనారాయణ మాట్లాడుతూ.. రూం నెంబర్ 5ను తమకు కేటాయించారని టీఎంసీ సభ్యులు చెప్పారని, బోర్డులు తీసేశారని కానీ, తమకు 3వ నెంబర్ రూం అలాట్ చేశారని, అంతలోనే వారు ఇలా చేశారని, దీనిపై తాము స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టీఎంసీ వైఖరి హేయమైనదని సుజనా చౌదరి మండిపడ్డారు.
దీనిపై టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. తమకు రూం నెంబర్ 5ను స్పీకర్ కార్యాలయం కేటాయించిందని, తాము 46 మంది ఎంపీలం ఉన్నామని, తమకే ఆ రూం దక్కాలని చెప్పారు. తాము 46 మందిమి ఉన్నామని, తమకు కూర్చునేందుకు ఎక్కడ స్థానం లేదన్నారు. టీడీపీకి మూడో నెంబర్ గది ఇచ్చారన్నారు.