రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును అడ్డుకుంటాం: సుజనా చౌదరి
కాంగ్రెస్, అన్నాడీఎంకేల వాకౌట్ మధ్య లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అయిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాల్సి ఉన్న నేపథ్యంలో ఆ బిల్లును సభలో అడ్డుకుంటామని టీడీపీ వ్యాఖ్యానించింది. వివాహ చట్టం అనేది ఏ మతానికైనా , కులానికైనా ఒక్కటిగానే ఉండాలని టీడీపీ కోరుకుంటోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు.
ముస్లిం సామాజిక వర్గానికి చెందిన భర్త భార్యకు ట్రిపుల్ తలాక్ చెబితే అతన్ని జైల్లో పెట్టడం అన్యాయం అని అన్నారు సుజనా చౌదరి. ఏ రకంగా చూసిన ఇది మేలు చేసే బిల్లు కాదని తాము భావిస్తున్నట్లు పేర్కొన్న సుజనా చౌదరి ఈ బిల్లును అడ్డుకుని తీరుతామని చెప్పారు. అంతేకాదు లోక్సభలో కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లును చాలా దౌర్జన్యంగా వ్యవహరించి పాస్ చేసిందని సుజనా చౌదరి ధ్వజమెత్తారు.
లోక్సభలో పాస్ అయిన ట్రిపుల్ తలాక్ బిల్లు ...సభ నుంచి కాంగ్రెస్ అన్నాడీఎంకే వాకౌట్
పార్లమెంటు అంటే ఒక దేవాలయంగా భావిస్తామని చెప్పిన సుజనా చౌదరి ... ఈ వ్యవస్థను బీజేపీ నిర్వీర్యం చేయాలని చూడటం సహించరానిదని తెలిపారు. ఇదిలా ఉంటే ట్రిపుల్ తలాక్ విషయంలో టీడీపీ విప్ జారీ చేసిందని చెప్పిన కేంద్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఏ మతానికి లేదా కులానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కచ్చితంగా ఈ బిల్లును పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే... ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాలుగు గంటల సుదీర్ఘ చర్చ తర్వాత పాస్ చేసింది. కాంగ్రెస్, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని లోక్సభలో డిమాండ్ చేశాయి. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ అన్నాడీఎంకేలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత వాయిస్ ఓటింగ్ ద్వారా బిల్లును సభలో ఆమోదం కోసం ప్రవేశ పెట్టగా... బిల్లుకు అనుకూలంగా 245 మంది ఓటువేయగా... 11 మంది సభ్యులు వ్యతిరేకించారు. దీంతో బిల్లు పాస్ అయినట్లు స్పీకర్ ప్రకటించారు.