పట్టపగలు. అదికూడా .క్లాస్రూంలో టీచర్పై కత్తితో దాడి చేసిన యువకుడు
భువనేశ్వర్: ఒడిషాలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలకు క్లాస్రూంలో పాఠాలు చెబుతుండగా ఓ టీచరును మరో వ్యక్తి మచ్చుకత్తితో దాడి చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటన కటక్ జిల్లాలో చోటుచేసుకుంది. సుకిష్మిత ముదులి అనే 25 ఏళ్ల టీచర్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెపై పలుమార్లు కత్తితో దాడి చేశారు. రక్తపు మడుగలో పడిపోయిన టీచర్ను స్కూలు యాజమాన్యం దగ్గరలోని హాస్పిటల్కు తరలించింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆమెను ఎస్సీబీ మెడికల్ కాలేజ్కు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అంబపారా ప్రాథమిక పాఠశాలలో టీచర్పై దాడి జరిగింది. లంచ్ బ్రేక్కు కొద్ది నిమిషాల ముందు ఆ వ్యక్తి టీచర్పై దాడి చేశాడు. నిందితుడిని బిభూతి మొహంతిగా గుర్తించారు. సుకిష్మిత విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సమయంలో మొహంతి తరగతి గదిలోకి ప్రవేశించి తన వెనకాల నుంచి కత్తి తీసి ఆమెను బెదిరించాడు. ఇది చూసిన విద్యార్థులు భయంతో తరగతి గదినుంచి బయటకు పరుగులు తీశారు. వాగ్వాదం తర్వాత సుకిష్మితపై కత్తితో పలుమార్లు దాడి చేశాడు మొహంతి. ఆమె వెనక, తలపై చేతులపై , కాళ్లపై తీవ్రగాయాలయ్యాయి. సుకిష్మితకు వివాహమై ఓ కూతురు ఉంది. స్కూలుకు సమీపంలోనే ఆమె నివాసం ఉంది. మరోవైపు నిందితుడు మొహంతి పక్కగ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.
సుకిష్మితపై దాడి చేశాక ఆమె రక్తపు మడుగులో పడి ఉండటం గమనించిన మొహంతి ఘటనా స్థలం నుంచి పరుగులు తీసి ఓ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే స్థానికులు వెంబడించి మొహంతిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తన భార్యను పట్టపగలే ఒక వ్యక్తి క్లాస్రూంలోకి వచ్చి కత్తితో దాడి చేస్తుంటే ఇతర టీచర్లు ఏమి చేస్తున్నారో తెలియడం లేదని సుకిష్మిత భర్త సౌభాగ్య మహోపాత్ర భోరున విలపించారు. ఇదిలా ఉంటే సుకిష్మితాపై మొహంతి ఎందుకు దాడి చేశారో అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణ ప్రకారం వన్సైడ్ లవ్ విఫలం కావడంతోనే సుకిష్మితాపై మొహంతి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.