ఉపాధ్యాయ దినోత్సవం: కొవ్వొత్తిలా తన్ను తాను కరిగించుకుని సమాజాన్ని వెలిగించేవాడే గురువు
నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి...ఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి....జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు...సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు. అతడే ...ఉపాధ్యాయుడు - సృష్టి స్థితి లయల నిర్దేశకుడు.. ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటోంది.
అజ్ఞానమనే చీకటిని తొలగించే వాడే గురువు
మన సంస్కృతిలో, గురువుకి, చాలా గొప్ప స్థానం ఉంది.. మాతృ దేవోభవ,పితృ దేవోభవ,ఆచార్య దేవోభవఅని అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తరువాత అంతటి వారుగా గురువుని కీర్తించారు వారు... "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది.మనం పుట్టినప్పటినుండి, జీవితం లో స్థిరపడే వరకు ప్రతి దశలోనూ, ఉపాధ్యాయుడి ముద్ర ఎంతైనా ఉంది.. అ ఆ ల నుండి, ఆర్కుట్ వరకు, భయభక్తుల నుంచి బ్లాగుల వరకు ఉన్న ఈ ప్రస్థానం లో, ప్రతి అడుగు చేయి పట్టుకుని మనల్ని నడిపించింది మన గురువులే. పాఠశాల లేని పల్లెటూరైనా ఉండొచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు.
పాఠాలు చెప్పే ప్రతీ వ్యక్తి ఉపాధ్యాయుడే
ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుంచి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది. ప్రాచీన కాలం లో, గురుకులాలు ఉండేవి.. గురువుకి గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం సాగించేవాళ్ళు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి వాళ్ళు కూడా, గురువులకి సేవ చేసి చదువుకున్నవారే. ఇప్పుడు విద్యావిధానం చాలా మారిపోయింది.. అయినప్పటికీ, గురువుల పాత్ర ఏమి తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువైంది.. అంతకుముందు, అయిదేళ్ళ వయసులో బడిలో చేరిస్తే, ఇప్పుడు రెండేళ్ళకో, మూడేళ్ళకో చేరుస్తున్నారు.. దాంతో, ఇంకా ఎక్కువ శ్రధ్ధ పెట్టాల్సి వస్తోంది.
వేదాలలో దేవుళ్లకన్నా గురువుకే అగ్రతాంబూలం ఇచ్చారు
ఒక ఇంజనీర్, ఒక్క ఇంజనీరుని చేస్తాడేమో, ఒక డాక్టర్ మహా అయితే ఇంకో డాక్టర్ ని తయారు చేస్తాడేమో.. కానీ కేవలం ఒక టీచర్ మాత్రమే, ఎంతో మంది డాక్టర్లని, మరెంతో మంది ఇంజనీర్లని, తనలాంటి టీచర్స్ ని తయారు చేయగలడు..అందుకేనేమో వేదాలలో, గురువుకి దేవుడి కన్నా అగ్రతాంబూలం ఇచ్చారు.. గురు బ్రహ్మః, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మః, తస్మైశ్రీ గురవే నమః. అసలు ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎలా మొదలయింది అనేదానికి ఒక చిన్న కధ ఉంది.. సర్వేపల్లి గారు జీవించి ఉన్న సమయంలో, కొంతమంది విద్యార్ధులు, స్నేహితులు కలిసి ఆయన పుట్టినరోజుని వేడుకగా చేద్దామని అంటే, దానికి ఆయన నా పుట్టినరోజుకంటే కూడా దాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా చేస్తే సంతోషిస్తాను అని అన్నారట.. దాంతో ఈ గురు పూజ్యోత్సవం మొదలయింది.
గురువు తప్పు చేస్తే విద్యార్థులంతా నష్టపోతారు
తల్లి లేదా, తండ్రి తప్పు చేస్తే కేవలం ఆ కుటుంబం మాత్రమే నష్టపోతుంది.. కానీ అదే ఒక గురువు తప్పు చేస్తే, ఆయన విద్యార్ధులందరూ నష్టపోతారు. మనం ఈ రోజు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, మనకి చదువు చెప్పి మన ఉన్నతికి సహాయపడిన గురువులని మర్చిపోలేము.. అందుకేనేమో, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన వీణ నేర్చుకున్న టీచర్ గారిని వేదిక మీదకి పిలిపించి సన్మానించారు.
బడిపంతులు అన్న నోళ్లు నేడు బ్రతుకు కొరకు బడిపంతులు అని కీర్తిస్తున్నాయి
ఒకప్పుడు బ్రతకలేక బడి పంతులు అనిపించుకున్న వృత్తి నేడు బ్రతుకు కొరకు బడి పంతులు అని వేనోళ్ళ కీర్తించబడుతుందంటే అందుకు కారణం సంఘ నిర్మాణంలో ఉపాధ్యాయుడు నిర్వర్తించిన పాత్రతప్ప మరోటి కాదు. అందుకే ఎంత ధనవంతులైనా, గొప్పవారైనా, గురువులకి శిరస్సు వంచి నమస్కారం చేస్తారు..మన ఉన్నతికి పాటుపడి, మనల్ని ఈ స్థాయికి చేర్చిన గురువులని ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం.. మరొక్కసారి గురువులందరికీ గురుపూజ్యోత్సవ శుభాకాంక్షలు