అమ్మ జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తారు: మోడీ
హైదరాబాద్: తల్లి జన్మనిస్తుంది.. గురువు జీవితాన్నిస్తాడని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదని చెప్పారు. రేపు గురుపూజోత్సవం సందర్భంగా ఢిల్లీలోని మానెక్షా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల వల్లే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందన్నారు. గొప్ప వైద్యులైనా, శాస్త్రవేత్తలైనా వారి వెనక గురువులు ఉంటారన్నారు. మన మనసులపై కూడా గురువుల ప్రభావం ఉంటుందన్నారు.
తనను ఉపాధ్యాయుడిగా ప్రజలు గుర్తుంచుకోవాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అనేవారని ప్రధాని గుర్తు చేశారు. అబ్దుల్ కలాం ప్రతిక్షణం కొత్త ప్రతిభను అన్వేషించేవారన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మరణార్థం ప్రధాని నాణెం విడుదల చేశారు.
9 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ముచ్చటించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు రాష్ట్రపతి ప్రణబ్ పాఠాలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఉపాధ్యాయుడిగా మారారు. గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఆవరణలోని డా. రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 11, 12వ తరగతి విద్యార్థులకు భారత రాజకీయ చరిత్రపై భోదన చేశారు. ప్రణబ్ మాట్లాడుతూ.. ‘వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన సాధారణ విద్యార్థిని నేను. ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లేవాడిని. చిన్నతనంలో చిలిపి పనులు చేసేవాడిని. నా తల్లి వారించేది' అని పేర్కొన్నారు.