డ్రామాలు ఆడితే చర్చలు రద్దు: పన్నీర్ సీరియస్: డెడ్ లైన్, తేల్చకుంటే !
తమ డిమాండ్లు నెరవేర్చకుండా ఎడప్పాడి పళనిసామి ఇలాగే మొండిగా వ్యవహరించి డ్రామాలు వేస్తే ఇక చర్చలకు చెక్ పెట్డడం తప్పా మరో మార్గం లేదని పన్నీర్ సెల్వం తేల్చి చెప్పారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాల విలీనం విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వ్యవహరిస్తున్న తీరుపై పన్నీర్ సెల్వం మండిపడ్డారు. తమ డిమాండ్లు నెరవేర్చకుండా ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ఇక చర్చలకు చెక్ పెట్డడం తప్పా మరో మార్గం లేదని పన్నీర్ సెల్వం తేల్చి చెప్పారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
అన్నాడీఎంకే డిప్యూటీ చీఫ్ గా జాజ్ సినిమాస్ సీఈవో ! చక్రం తిప్పుతున్న శశికళ !
విలీన చర్చలకు చెక్ పెట్టి ప్రజల్లోకి వెళ్లి అమ్మ జయలలిత వారసులు ఎవరు ? అనే విషయం తేల్చుకోవాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారని తెలిసింది. విలీనం కోసం తాము నియమించిన ఏడుగురు సభ్యుల కమిటీని రద్దు చెయ్యాలని పన్నీర్ సెల్వం ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. తమిళనాడులోని 32 జిల్లాల్లో పర్యటించి స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి పన్నీర్ సెల్వం సిద్దం అయ్యారు.
రెండు వర్గాలు కలిసిపోతే మేలు
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసిపోతే పార్టీకి మేలు జరుగుతుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల చిహ్నం మీద పోటీ చేయొచ్చని ఇరు వర్గాల అగ్రనేతలు విలీన చర్చలకు శ్రీకారం చుట్టారు. చర్చలకు తాము సిద్దం అంటూ ఇరు వర్గాలు బహిరంగంగా చెప్పాయి.
డిమాండ్లను పట్టించుకోని పళనిసామి
పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్లను సీఎం ఎడప్పాడి పళనిసామి, ఆయన మంత్రి వర్గం తేలిగ్గా తీసుకుని పట్టించుకోలేదు. తమ డిమాండ్ల నేరవేర్చడానికి పళనిసామి వర్గం సుముఖత వ్యక్తం చెయ్యకపోవడంతో పన్నీర్ సెల్వం సీరియస్ అయ్యారని, ఇప్పుడే ఇలా ఉంటే ముందు వారిని ఎలా నమ్మాలి అని పన్నీర్ వర్గీలు ప్రశ్నిస్తున్నారని సమాచారం.
చిన్నమ్మ, దినకరన్ విషయంలో
శశికళ, టీటీవీ దినకరన్ ను పార్టీకి దూరం పెడుతామని పళనిసామి వర్గం ప్రకటించింది. అయితే వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించలేదు. మరోవైపు శశికళ, దినకరన్ పేర్లతో కూడిన ఓ అఫిడవిట్ ను ఎన్నికల కమిషన్ కు సమర్పించి రెండాకుల చిహ్నం కావాలని మనవి చేశారు.
విలీనం కావాలని ఉందా ? లేదా
ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి బేషరతుగా తాము చర్చలకు సిద్దం అని ప్రకటించారు. శశికళ, దినకరన్ ల విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే అసలు వాళ్లకు విలీనం కావాలని ఉందా ? లేదా ? అని పన్నీర్ సెల్వం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు
మెజరిటీ ఎమ్మెల్యేలు మనవైపు ఉన్నారని, రెండాకుల చిహ్నం కూడా మనకే వస్తుందని, ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గంతో మనకు ఏం పని ఉందని పళనిసామి ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ విషయంలో మనం ఇంకా సహించి విలీనం గురించి మాట్లాడితే చులకన అయిపోతామని పన్నీర్ సెల్వం అంటున్నారని తెలిసింది.
ఆ రెండు డిమాండ్లు ఓకే అంటేనే విలీనం
జయలలిత మరణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, శశికళ, టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తోంది. అయితే జయలలిత మరణం విషయం కోర్టులో ఉందని, శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక విషయం ఎన్నికల కమిషన్ దగ్గర పెండింగ్ లో ఉందని చెబుతున్న పళనిసామి వర్గం తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ప్రజల ముందుకు పన్నీర్ సెల్వం
మంగళవారం సాయంత్రం లోపు (మే 2వ తేదీ) తమ డిమాండ్లు తీర్చకపోతే అన్నాడీఎంకే రెండు వర్గాల విలీన చర్చలకు చెక్ పెట్టాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారని తెలిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు. మే 5వ తేది కాంచీపురంలో పర్యటన ప్రారంభం అవుతుందని, 32 జిల్లాలో పన్నీర్ సెల్వం పర్యటిస్తారని పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకుడు, మెట్టూరు ఎమ్మెల్యే ఎస్. సెమ్మలై చెన్నైలో మీడియాకు చెప్పారు.