విషాదం: బస్సును ఢీకొన్న ట్రక్కు.. 10 మంది మృతి
విల్లుపురం : తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో బస్సు, ట్రక్కు తుక్కుతుక్కయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో మొత్తం 14 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 11 మంది జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వారు. వీరంతా కాంచీపురం నుంచి తిరువూర్కు కరెంటు తీగల ఏర్పాటు పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో మధురైకి చెందిన ట్రక్కు డ్రైవర్ ఎం. మణికందన్, తిరునైవ్వేలీకి చెందిన బస్సు డ్రైవర్ ఎ.రాజేంద్రన్ ఉన్నారు. మిగిలిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడినవారిని దగ్గరిలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గురైన బస్సులో 26మంది ప్రయాణికులు ఉన్నారు. చెన్నై నుంచి కోయంబత్తూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కల్లకుర్చీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున 2.45గంటల సమయంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కల్లకుర్చి - సేలం నేషనల్ హైవేపై మూడు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది.