భార్యని కాల్చి చంపిన టెక్కీ, ముందే ఇద్దరు భార్యలు మృతి
పుణే: పుణేలో 38 ఏళ్ల టెక్కీ ఒకరు తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. ఆమె గైనకాలజిస్ట్గా పని చేస్తున్నారు. హింజవాడిలోని ఆమె క్లినిక్ వద్ద గొడవ జరిగిందని, అతను అక్కడే కాల్చి చంపాడని పోలీసులు గురువారం నాడు వెల్లడించారు.
హత్య చేసిన టెక్కీ పేరు మనోజ్ పటిదార్. ఇతను సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. అతని భార్య డాక్టర్ అంజలీ పటీదార్. కుటుంబ కలహాల కారణంగా బుధవారం రాత్రి అతను కాల్చి చంపేశాడు. నిందితుడు గతవారం రూ.20వేలకు తుపాకీ కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఎందుకు చేశావ్: నిందితుడితో ఇన్ఫోసిస్ టెక్కీ తండ్రి, కోర్టుకు రామ్
బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భార్యను చంపి, ఏడాదిన్నర వయసున్న కుమారుడిని అక్కడే వదిలి పారిపోయాడు. అతను పుణె నుండి తప్పించుకునేందుకు యత్నిస్తుండగానే పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
విచారణలో అతనికి ఇది వరకే రెండు పెళ్లిళ్లు అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు భార్యలు కూడా అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం గమనార్హం. మూడో భార్య అయిన అంజలిని తుపాకీతో కాల్చి చంపాడు. అతనికి తుపాకీ ఎవరు అమ్మారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు.
గతంలో ఇద్దరు భార్యల మృతి పైన అతనిని ప్రశ్నిస్తే, వారు భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని నిందితుడు మనోజ్ పటీదార్ చెబుతున్నాడని పోలీసులు అంటున్నారు. వరుస హత్యల నేపథ్యంలో ఏమైనా ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడి పైన సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. గురువారం కోర్టులో హాజరుపరిచారు.