21కె మారథాన్: పరుగెడుతూ గుండెపోటుతో టెక్కీ మృతి
బెంగళూరు: కర్ణాటకలోని రామనగరం జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన 21 కిలోమీటర్ల పరుగులో పాల్గొన్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మరణించాడు. బెంగళూరులో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రకాష్ గుప్తా(27) 18 కిలోమీటర్లు పరుగెత్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
అతనితోపాటు ఉన్న మరో ఐదుగురు స్నేహితులు వెంటనే మారథాన్లో వైద్యుడి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అందించిన ఆ వైద్యుడు, హుటాహుటిన అంబులెన్స్లో రామనగరంలోని అభి ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం రాజరాజేశ్వరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రకాష్ ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. ఈ మారథాన్లో 1,245 మంది 21.1 కి.మీ, 11కి.మీ, 7కి.మీ కేటగిరిలు ఉన్నాయని తెలిపారు. బసవనపుర నుంచి ఉదయం 6.45 ఈ పరుగు ప్రారంభమైందని తెలిపారు.
బాలికకు నిప్పంటించిన పోలీసు: అరెస్ట్
ఇండోర్: ఓ మైనర్ బాలికకు నిప్పుపెట్టిన కేసులో ఓ పోలీసు కానిస్టేబుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్న నిందితుడు ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు.
గమనించిన ఇరుగుపొరుగువారు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 95శాతం కాలిన గాయాలతో బాధిత బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆమె వాంగ్మూలం మేరకు నిందితుడు ప్రకాశ్ జరోలియా పోలీసులు అరెస్ట్ చేశారు.