బెంగళూరులో టెక్కీ మాయం, ధక్షిణాధి రాష్ట్రాలకు పీఎంవో లేఖ, ఆచూకి చెప్పండి!
బెంగళూరు: బెంగళూరులో మాయం అయిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు కేసు విచారణ ఏమైయ్యింది అంటూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) దక్షిణాధి రాష్ట్రాలను ప్రశ్నించింది. టెక్కీ మాయం అయిన కేసులో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పీఎంవో ఆదేశాలు జారీ చేసింది.
2017 డిసెంబర్ 18వ తేదీ బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో ఇంటికి బయలుదేరిన అజితాబ్ అదృశ్యం అయ్యాడు. కేసు నమోదు చేసిన వైట్ ఫీల్డ్ పోలీసులకు అజితాబ్ గురించి ఒక్క చిన్న ఆధారం చిక్కలేదు. అప్పటి నుంచి అజితాబ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వేరే రాష్ట్రాలకు చెందిన సంఘ వ్యతిరేక శక్తులు అజితాబ్ ను టార్గెట్ చేసి ఉంటారనే అనుమానంతో అతని కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సంప్రధించారు. అజితాబ్ ఆచూకి కోసం దక్షిణాధి రాష్ట్రాలతో విచారణ జరిపించాలని అతని కుటుంబ సభ్యులు మే 13వ తేదీ ప్రధాని కార్యాలయంలో మనవి చేశారు.
అజితాబ్ ఆచూకి కనిపెట్టడానికి విచారణ చెయ్యాలని ప్రధాన మంత్రి కార్యాలయం కర్ణాటకతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్న మూడు మృతదేహాలను అజితాబ్ కుటుంబ సభ్యులకు చూపించారు. మూడు మృతదేహాలల్లో అజితాబ్ మృతదేహం లేదని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.