జంట హత్యలు: టెక్కీకి మరణశిక్ష, ప్రేయసికి జీవితఖైదు
తిరువనంతపురం: జంట హత్యల కేసులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కేరళలోని ఓ కోర్టు మరణశిక్ష విధించింది. అతడి ప్రేయసి అయిన తోటి ఉద్యోగినికి జీవిత ఖైదు విధించింది. అ వ్యక్తి తన ప్రేయసి మూడేళ్ల కుమార్తెను, అత్తను హత్య చేసి ఆ తర్వాత ఆమె భర్తనూ చంపేందుకు ప్రయత్నించాడు.
ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును అత్యంత అరుదైనదిగా, అమ్మతనానికి అవమానంగా కోర్టు అబిప్రాయపడింది. నినో మాథ్యూ, అను శాంతి ఇద్దరూ తిరువనంతపురంలోని టెక్పార్క్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. 2014 ఏప్రిల్ 16వ తేదీన అను శాంతితో కలిసి నినో మాథ్యూ ఈ హత్యలు చేశాడు. అనుశాంతి మూడేన్నరేళ్ల కూతురు స్వస్తిక, అత్త విజయమ్మ(58)ను నరికి చంపేశాడు.
అనుశాంతి భర్త లిజేశ్ను కూడా చంపడానికి అతనిపై దాడి చేశాడు. కానీ అతను గాయాలతో తప్పించుకొని బయటకు పారిపోయి ఇరుగుపొరుగును పిలవడంతో మాథ్యూ దొరికిపోయాడు. నేరానికి సంబంధించి ఆధారాలు లభ్యం కావడంతో మాథ్యూకు మరణ శిక్ష, అనుశాంతికి జీవిత ఖైదు విధిస్తూ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు.
అనుశాంతి మాతృత్వానికే మాయనమచ్చ అని జడ్జిగా అభివర్ణించారు. ఆమె కూడా ఈ నేరంలో పాలుపంచుకున్నట్లు చెప్పారు. ఇది అత్యంత కిరాతకమైన, అరుదైన ఘటన అని అన్నారు. అనుశాంతికి జీవిత ఖైదుతో పాటు కోర్టు రూ.50 లక్షల జరిమానా కూడా విధించింది.
హత్య చేసిన పారిపోవడానికి ప్రియుడు నినో మాథ్యూకు ఇంటి లేఅవుట్ను, పారిపోవడానికి మార్గాలను వివరించినట్లు ఆధారులు లభించాయి. ఈ కేసులో అనుశాంతి భర్త లీజీష్ ప్రథమ సాక్షి అని ప్రాసిక్యూషన్ చెప్పింది.